హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 30 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓఎస్డీ పీఏనంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని, అతనికి సహకరిస్తున్న ఇద్దరిని హైదరాబాద్ నార్త్జోన్ పోలీసులు అరెస్టు చేశారు. వారినుంచి రూ.2.2 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్.. టాస్క్ఫోర్స్ డీసీపీ (ఓఎస్డీ) రాధాకిషన్రావుతో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు.
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం, తార్పల్లికి చెందిన అవుసోదపు సుధాకర్ కాప్రా పరిధిలోని గౌరినాధపురంలో నివాసముంటున్నాడు. 2004లో హైదరాబాద్కు వచ్చిన అతడు 2010 వరకు సచివాలయంలోని టూరిజం, ట్రైబల్ వెల్ఫేర్ శాఖల వాహనాలకు డ్రైవర్గా పనిచేశాడు. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగి అవతారమెత్తిన అతడు.. హంగూ అర్భాటాలు చేస్తూ, ప్రభుత్వ ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేశాడు. బాధితులు డబ్బులకోసం ఒత్తిడి చేయడంతో 2016లో ఐపీ పెట్టి అజ్ఞాతంలోకి వెళ్లాడు. 2019లో ఫార్చ్యూనర్ కారు, డ్రైవర్, వెంట గన్తో కొత్త అవతారమెత్తాడు. ముఖ్యమంత్రి ఓఎస్డీ పీఏగా పనిచేస్తున్నానని, సచివాలయంలోని ఉన్నతాధికారులందరితో పరిచయాలున్నాయని, అవసరమైతే సీఎంతో స్వయంగా మాట్లాడుతానంటూ అమాయకులను నమ్మించారు.
డబుల్ బెడ్రూం ఇండ్లు, తక్కువ ధరకు ప్రభుత్వ స్థలాలు, పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తానని, తక్కువ ధరకు బంగారం విక్రయిస్తానంటూ సుమారు 100 మంది నుంచి రూ.3 కోట్లు వసూలు చేశాడు. అతడిపై మహంకాళి, ఎస్సార్నగర్, రాంగోపాల్పేట, ఉస్మానియా యూనివర్సిటీ, మేడిపల్లి పీఎస్ల పరిధిలో 8 కేసులు నమోదయ్యాయి. దీంతో నిఘాపెట్టిన టాస్క్ఫోర్స్ నార్త్జోన్ ఇన్స్పెక్టర్ కే నాగేశ్వర్రావు.. సుధాకర్, వరంగల్ జిల్లా ధర్మసాగర్కు చెందిన సంగోజు నాగరాజు, డ్రైవర్ బట్టల భీమయ్యను అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.1.30 కోట్ల నగదు, రూ. 1.03 కోట్ల విలువైన ఇంటి డాక్యుమెంట్లు, కారు, బొమ్మ తుపాకీ స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ కూడా చదవండి