కరువు నేలను సస్యశ్యామలం చేస్తా
త్వరలో కూడవెళ్లి వాగు ద్వారా కాళేశ్వర జలాలు
శరవేగంగా ఎగువ మానేరుకు కాలువల నిర్మాణ పనులు
రైతు వేదికలకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇప్పిస్తాం
నేరుగా శాస్త్రవేత్తలతో మాట్లాడే అవకాశం
బొప్పాపూర్లో తొలి ఏసీ వేదిక
దాత గోవర్ధన్ గౌడ్ అభినందనీయుడు
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్
గోదావరి జలాలతో కరువునేలను అభిషేకిస్తానని, సస్యశ్యామలంగా మార్చి రైతుల రుణం తీర్చుకుంటానని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. తమ గ్రామాలకు ఏదైనా చేయాలనే తలంపుతో ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపునకు స్పందించి, బొప్పాపూర్లో రైతువేదిక నిర్మాణం చేసిన చిదుగు గోవర్ధన్ గౌడ్ను సన్మానించారు. అనంతరం మాట్లాడారు. ఇది రాష్ట్రంలోనే తొలి ఏసీ వేదిక అని చెప్పారు. మల్లన్న సాగర్ నీటిని కూడవెళ్లి వాగులోకి వదిలారని, ఆ వాగు ద్వారా నర్మాల ఎగువమానేరు జలాశయంలోకి చేరుతుందని చెప్పారు. ఎగువమానేరు శాశ్వత జలకళతో ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి ఎగువ మానేరు ప్రాజెక్టును నింపేందుకు ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా త్వరలోనే ప్రారంభించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలనే ముఖ్యమంత్రి పల్లె ప్రగతిని తీసుకొచ్చి, నిధులు కేటాయిస్తున్నారని గుర్తు చేశారు. రైతులు ఎవరి వద్ద చేయి చాచవద్దనే కేసీఆర్ కల నెరవేరుతున్నదని, వారి శ్రేయస్సు కోసం పాటుపడిన ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పారు. ఆరు నెలల కాలంలోనే రాష్ట్రంలో 2600 రైతు వేదికలను నిర్మించామని అన్నారు. ఏ గుంటలో ఏ పంట పండుతుందో లెక్కంతా ఆన్లైన్లో ఉంటుందని అన్నారు. రైతు వేదికలకు త్వరలో ఇంటర్నెట్ కనెక్షన్ అందిస్తామని, నేరుగా వ్యవసాయ శాస్త్రవేత్తలతో రైతులు మాట్లాడే అవకాశం కల్పిస్తామని అన్నారు. ప్రభుత్వం అందించే ప్రోత్సాహంతో దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని, దాదాపు 60 శాతం బియ్యం ఇక్కడే ఉత్పత్తి అవుతున్నదన్న విషయాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఇండియా చెబుతున్నదని వివరించారు. రుణమాఫీ సైతం అమలు చేస్తున్నామని, గత బడ్జెట్లో 25 వేల వరకు మాఫీ చేశామని, ఈసారి బడ్జెట్లో లక్ష వరకు మాఫీ చేయడానికి నిధులు కేటాయించినట్లు వివరించారు.