హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): అర్హులందరికీ గొర్రెల యూనిట్లు పంపిణీ చేస్తామని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా మాట్లాడుతూ.. రెండోవిడుత గొర్రెల పంపిణీ కోసం బడ్జెట్లో రూ.3వేల కోట్లు కేటాయించామని, సుమారు 3 లక్షల మంది అర్హులకు యూనిట్లను పంపిణీ చేస్తామని తెలిపారు. తెలంగాణలో గొర్రెల సంఖ్య 1.2 కోట్ల నుంచి 3 కోట్లకు చేరిందని అన్నారు. పంపిణీ చేసిన గొర్రెల వల్ల సుమారు రూ.5,490 కోట్ల సంపద సృష్టించినట్టు తెలిపారు. మాంసం కల్తీ, ధరలను నియంత్రించేందుకు తెలంగాణ బ్రాండ్ పేరిట మాంసం విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.