గుడిహత్నూర్, మార్చి 17: ఆదిలాబాద్ జిల్లాలో పండ్లతోటల విస్తీర్ణం పెరుగుతున్నది. ఉద్యానవన శాఖ అధికారుల సలహాలు, ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు సద్వినియోగం చేసుకుంటూ రైతులు పండ్లతోటల వైపు మళ్లుతున్నారు. జామ, దానిమ్మ, అరటి, నిమ్మ, బొప్పాయి, సపోట, డ్రాగన్ఫ్రూట్ వంటి తోటల సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. వీటి సాగును మరింత పెంచేలా ప్రభుత్వం రైతులను ప్రోత్సహించేందుకు సమీకృత ఉద్యానవన అభివృద్ధి పథకం ద్వారా వాటి సంరక్షణ కోసం 40 శాతం రాయితీని మూడేళ్ల పాటు అందిస్తున్నది. అతివృష్టి, అనావృష్టితో ఏటా ఏదో రకంగా పంట దిగుబడి రాక నష్టపోతుండడంతో, పండ్ల తోటల పెంపకంపై రైతులు దృష్టి సారిస్తున్నారు. బిందు, సూక్ష్మ సేద్యం లాంటి ఆధునిక పద్ధతులు అందుబాటులోకి రావడంతో సాగు సులభతరంగా మారింది. జిల్లాలో మామిడి 750 ఎకరాలు, దానిమ్మ 180, సీతాఫలం 120,జామ 90, యాపిల్ బేర్ 40 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. మరికొన్ని రకాలను కూడా వివిధ ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు.
పండ్ల తోటల సాగుకు రాయితీ
పండ్ల తోటలను సాగు చేసే రైతులకు మూడేళ్ల వరకు రాయితీలను ప్రభుత్వం అందిస్తున్నది. మామిడి రైతులకు హెక్టారుకు రూ.16,400, జామ హెక్టారుకు రూ.29,332, దానిమ్మ హెక్టారుకు రూ.26,672, నిమ్మ, బత్తాయి హెక్టారుకు రూ 16,001, సీతాఫలం హెక్టారుకు
రూ.42,400, ఆపిల్ బేర్ హెక్టారుకి రూ.14,000 ప్రభుత్వం మూడేళ్ల వరకు రాయితీ ద్వారా అందిస్తున్నది.
25 ఎకరాల్లో పండ్లతోటలు
గుడిహత్నూర్ మండలంలోని మాన్కాపూర్ గ్రామానికి చెందిన కామ్లె మాధవ్ తనకున్న 25ఎకరాల భూమిలో వివిధ రకాల పండ్ల తోటలను పెంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. మొదట 2019 లో 6 ఎకరాల్లో 870 జామ మొక్కలు నాటాడు. నాటిన ఒక సంవత్సరం నుంచి కాతకొచ్చాయి. రెండు ఎకరాల్లో యాపిల్ బేర్, 7 ఎకరాల్లో సీతాఫలం, 5 ఎకరాల్లో బొప్పాయి, రెండు ఎకరాల్లో ఖర్జూరా(ఆరు వేల చెట్లు), ఒక ఎకరంలో 150 పనస, రెండున్నర ఎకరాల్లో 800 మోసంబి మొక్కలు నాటాడు. జామ, యాపిల్బేర్ కాతకు రావడంతో చుట్టు పక్కల రైతులు కూడా పండ్ల తోటల పెంపకంపై దృష్టి సారిస్తున్నారు.
పండ్ల తోటలు లాభదాయకం..
పండ్ల తోటల పెంపకమే లాభదాయకంగా ఉంది. నా మిత్రుడు మహారాష్ట్రలో ఉంటాడు. ఆయన సొంత భూమిలో వివిధ రకాల పండ్ల తోటలు సాగు చేస్తున్నాడు. ఆయన ద్వారా తోటల పెంపకం విషయం తెలుసుకొని నేనూ ముందుకువచ్చా. ప్రారంభంలో ఒకటిన్నర ఎకరంలో సుమారు 2లక్షల ఖర్చుతో జామ తోటను సాగు చేయగా 18 నెలల నుంచి కాతకొచ్చాయి.మంచి దిగుబడి వచ్చింది. దీంతో వివిధ రకాల పండ్ల తోటలను పెంచుతున్నాను. యాపిల్బేర్ కాతకు రావడానికి రెండేళ్లు పట్టింది. నిమ్మ, సీతాఫలం, మిగతా పండ్ల మొక్కలు పెరుగుదలలో ఉన్నాయి.
-కామ్లె మాధవ్. రైతు మాన్కాపూర్