హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): లక్షమందికి ఉపాధి కల్పించే 20 వేల మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణలో ఎక్కువగా పండే వరి, పప్పులు, శనగ, తృణధాన్యాలు, పసుపు, కారం తదితర పంటలను ప్రాసెసింగ్ చేసేందుకు ఈ యూనిట్లు తోడ్పడనున్నాయి. ఈ మేరకు అవర్ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో శుక్రవారం ఎంవోయూ కుదుర్చుకున్నది. మేక్ ఇన్ తెలంగాణలో భాగంగా జహీరాబాద్లోని ‘అవర్ఫుడ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్’లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన సామగ్రిని తయారు చేయనున్నది. యువతకు ఉపాధి, రైతుల ఆదాయ వృద్ధికి ఈ యూనిట్లు దోహదపడుతాయని ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్ తెలిపారు. అవర్టెక్ సంస్థ సీఈవో బాల్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణతో పాటు 9 రాష్ర్టాల్లో వెయ్యి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఇప్పటికే ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ యూనిట్ల ఏర్పాటుతో రాష్ట్రంలోని 40 వేల మంది గ్రామీణ యువతకు ప్రత్యక్షంగా, మరో 60వేల మందికి పరోక్ష ఉపాధి లభిస్తుంది. రూ.1,535 కోట్ల పెట్టుబడితో రూ.24,409 కోట్లు ఆదాయాన్ని ఆర్జించవచ్చు. ఐదేండ్లలో రైతు ప్రాంచైజీలకు రూ.2,440 కోట్లు, రైతులకు రూ.4,881 కోట్ల వరకు లాభాలు ఉంటాయి.