మహబూబ్నగర్, మార్చి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెరపడింది. గత నెల 16వ తేదీ నుంచి 23 వరకు నామినేషన్లు నామినేషన్ల స్వీకరించారు. 26న అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. 93 మంది బరిలో నిలిచారు. వీరిలో 13 మంది వివిధ పార్టీల అభ్యర్థులు, 80 మంది స్వతంత్రులు ఉన్నారు. ఫిబ్రవరి 26 నుంచే అన్ని పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ప్రచారంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరనేది ఉత్కంఠకు తావిచ్చింది. మాజీ ప్రధాని కూతురు, విద్యావేత్త సురభి వాణీదేవికి టికెట్ రావడంతో అన్ని వర్గాల ప్రజలు ఆమోదించారు. ముఖ్యంగా కల్వకుర్తి మండలం రఘుపతిపేటకు చెందిన వాణీదేవికి టికెట్ దక్కడంపై ఉమ్మడి పాలమూరు వాసులు హర్షం వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో ఉమ్మడి జిల్లాను అభివృద్ధి బాట పట్టిస్తున్నందున పట్టభద్రులు టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతిస్తున్నారు. పీఆర్సీ, పదవీ విరమణ వయస్సు పెంపు వంటి నిర్ణయాలు ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు తీపి కబురునిచ్చాయి. ప్రధాన ఉపాధ్యాయ సంఘం పీఆర్టీయూ, టీజీవోలు, టీఎన్జీవోలు, ఇతర ఉద్యోగ సంఘాలు టీఆర్ఎస్ అభ్యర్థికే మద్దతిచ్చాయి. ఉమ్మడి పాలమూరులోని ప్రతి నియోజకవర్గంలోనూ వాణీదేవి ప్రచారంలో పాల్గొన్నారు. ఉద్యోగాలు, ఉపాధ్యాయులు, పట్టభద్రులతో జరిగిన ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇన్చార్జిగా వచ్చిన రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఉమ్మడి జిల్లా మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్తో కలిసి చక్కని ప్రణాళికతో ప్రచారం చేపట్టారు. ఎక్కడికక్కడ ఓటర్ల బాధ్యతలను కార్యకర్తలకు అప్పగిస్తూ మిగతా పార్టీలకు దిక్కుతోచని తీరుగా ప్రచారం నిర్వహించారు. ప్రతి పట్టభద్రుడినీ వ్యక్తిగతంగా కలుస్తూ మిగతా పార్టీలకు అందనంత దూకుడు ప్రదర్శించింది. పార్టీ నేతలు, కార్యకర్తలు చేసిన అభివృద్ధిని వివరించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు సైతం స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించారు.