తిరువల్ల, మార్చి 4: కేరళలో అధికారాన్ని కైవసం చేసుకోవటమే లక్ష్యంగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఇటీవలే పార్టీలో చేరిన మెట్రోమ్యాన్ శ్రీధరన్ను ఎన్డీఏ తరఫున సీఎం అభ్యర్థిగా రాష్ట్ర బీజేపీ యూనిట్ ఎంపిక చేసింది. శ్రీధరన్ను కేరళ సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని పార్టీ జాతీయ నాయకత్వాన్ని కేరళ బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్ కోరారు. ‘శ్రీధరన్ నేతృత్వంలో కేరళలో ఎన్డీఏ అధికారంలోకి వస్తే ప్రధాని మోదీ సహకారంతో10 రెట్లు వేగంగా అభివృద్ధి పనులను చేపడతాం’ అని పేర్కొన్నారు. సురేంద్రన్ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత కేంద్రమంత్రి వీ మురళీధరన్ స్పందించారు. శ్రీధరన్ నేతృత్వంలోనే బీజేపీ ఏప్రిల్ 6న జరిగే కేరళ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తుందని, ఆయనే సీఎం అభ్యర్థి అని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో సీపీఎం, కాంగ్రెస్లను ఓడిస్తామని, అవినీతిరహితంగా, అభివృద్ధి మార్గంలో పాలనను అందిస్తామని ట్వీట్ చేశారు. శ్రీధరన్ వయస్సు 88 ఏండ్లు. సాధారణంగా వయోవృద్ధ నేతలను పక్కన పెట్టే బీజేపీ.. శ్రీధరన్ను సీఎం అభ్యర్థిగా ఎంపిక చేయడం గమనార్హం.
ప్రస్తుతం ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) సలహాదారుగా ఉన్న శ్రీధరన్ గురువారం పలారీవట్టోమ్ ఫ్లైఓవర్ను పరిశీలించారు. అనంతరం ప్రారంభ కార్యక్రమం కోసం కేరళ ప్రభుత్వానికి అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘నేను తొలిసారి 1997 నవంబర్లో డీఎంఆర్సీ యూనిఫాం వేసుకొన్నాను. 24 ఏండ్లుగా వేసుకొంటూనే ఉన్నాను. ఇక ఈ యూనిఫాం ధరించడం ఇదే ఆఖరు రోజు’ అని అన్నారు. రాజకీయాల్లోనూ టెక్నోక్రాట్ శైలిలోనే వ్యవహరిస్తానని, సాధారణ రాజకీయ నాయకుడిలా ఉండనని చెప్పారు. ‘ఇది డిజిటల్ యుగం. నేను ఇంటింటికి తిరిగి ఓట్లు అడగను. కానీ నా సందేశం ప్రతీ ఇంటికి చేరుతుంది’ అని అన్నారు. కేరళలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.