సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెలుగులోనే కాదు బాలీవుడ్ లో కూడా అదిరిపోయే ఇమేజ్ ఉంది. హిందీ హీరోలు కూడా మన మహేష్ బాబును చూసి కుళ్లుకుంటారు. అచ్చం హాలీవుడ్ హీరోలా ఉన్నాడు అంటూ రణ్ వీర్ సింగ్ లాంటి బాలీవుడ్ స్టార్స్ కూడా ఈయన అందాన్ని పొగుడుతూ ఉంటారు. ఇక హీరోయిన్ల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. అష్టా చమ్మా సినిమాలో కలర్స్ స్వాతి చెప్పినట్లు మహేష్ అనే పేరులోనే ఏదో మత్తు ఉంది. అందుకే ఆయన పేరు చెప్పగానే అమ్మాయిలంతా మెలికలు తిరుగుతుంటారు. అందులో బాలీవుడ్ హీరోయిన్లు కూడా ఉన్నారు. తాజాగా మహేష్ అంటే తనకు ఎంత ఇష్టమో మీడియా ముందు చెప్పింది బాలీవుడ్ ముద్దుగుమ్మ పరిణీతి చోప్రా.
లేడీస్ వర్సెస్ రికీ బెల్ సినిమాతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత దాదాపు పది సినిమాలకు పైగా నటించింది. మధ్యలో కొన్ని సార్లు తెలుగు సినిమాల్లో అవకాశం వచ్చినా కాదనుకుంది. కేవలం బాలీవుడ్ సినిమాలు మాత్రమే చేస్తాను అంటూ గిరి గీసుకుంది పరిణితి. ప్రస్తుతం ఈమె సైనా నెహ్వాల్ బయోపిక్ లో నటిస్తుంది. ఈ సినిమా మార్చిలో విడుదల అవుతుంది. పాన్ ఇండియా సబ్జెక్ట్ కావడంతో అన్ని భాషలలో సైనా బయోపిక్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ వచ్చింది పరిణీతి చోప్రా.
టాలీవుడ్ హీరోల గురించి.. మరీ ముఖ్యంగా మహేష్ బాబు గురించి చెప్పుకొచ్చింది పరిణితి. తనకు మహేష్ అంటే చాలా ఇష్టమని.. ఎన్నో ఏళ్లుగా ఆయన అభిమానిగా ఉన్నాను అంటుంది ఈ భామ. అంతే కాదు తెలుగులో కేవలం మహేష్ బాబు సినిమాలో మాత్రమే నటిస్తానని.. మరే హీరోతో కూడా నటించనని తెగేసి చెప్పింది పరిణీతి చోప్రా. తనకు మహేష్ అంటే ఉన్న ఇష్టంతోనే సినిమా చేస్తా అని చెప్పింది. గతంలో దీపికా పదుకునే కూడా టాలీవుడ్ లో మహేష్ బాబు అంటే ఇష్టం అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆమెతో పాటు బిపాషా బసు, దిశా పటాని లాంటి హీరోయిన్లు కూడా తమకు మహేష్ బాబు అంటే ఇష్టం అంటూ చెప్పుకొచ్చారు. ఏదేమైనా బాలీవుడ్ లో కూడా తన అందంతో మాయ చేస్తున్నాడు మహేష్ బాబు.