సీఎం కేసీఆర్ దళిత జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడుతున్నడు
మంత్రి కొప్పుల ఈశ్వర్
జమ్మికుంటలో భారీ ర్యాలీ, అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు పాలాభిషేకం
జమ్మికుంట, జూలై19: దళితులను పేదరికం నుంచి బయటపడేసేందుకే దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్నారని, ఈ పథకం దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. సీఎం కేసీఆర్ ఆదివారం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టగా, సోమవారం జమ్మికుంటలో మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొప్పుల ఈశ్వర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ హాజరయ్యారు. ముందుగా మోత్కులగూడెం చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ర్యాలీ తీసి, మాట్లాడారు. దళితుల కోసం సీఎం చేస్తున్న ఆలోచనలు, పథకాల రూపకల్పన గొప్పదని, ఆయనకు హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజల తరపున శిరస్సువంచి నమస్కరిస్తున్నానని చెప్పారు. తరతరాలుగా వెనుకబడిన దళితులకు ఈ పథకం గొప్ప వరమని తెలిపారు. పథకం అమలు ఇక్కడి నుంచే ప్రారంభిస్తానని చెప్పడం మన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి 70ఏళ్లు దాటిందని, దళితులకు ఇప్పటి వరకు ఏ నాయకుడు, పీఎం, సీఎంలు ఎవరూ ఏం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరూ చేయలేనిది ఒక్క కేసీఆర్ చేసి చూపించారని, ఒక్క మాటలో చెప్పాలంటే దళిత జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడుతున్నాడని కొనియాడారు.
నియోజకవర్గంలోని 21వేల కుటుంబాలకు 2వేల కోట్లు కేటాయించిన ఘనుడు సీఎం కేసీఆర్ అని, ఆయనకు దళిత జాతి రుణపడి ఉంటుందన్నారు. ఒక్కో దళిత కుటుంబానికి 10లక్షలు అందించే ప్రణాళిక తయారు చేశారని, హుజూరాబాద్ను పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకుని త్వరలో ప్రారంభిస్తారని తెలిపారు. ముస్లిం మైనార్టీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు.. ఇలా చెప్పుకుంటూ పోతే బీజేపీ అందరికీ వ్యతిరేకంగానే పనిచేస్తున్నదని, ఏ వర్గానికి అనుకూలమో ప్రజలకు తెలియజెప్పిన తర్వాతే ఎన్నికలకు రావాలని డిమాండ్ చేశారు. రైతుల నడ్డివిరిచే నల్ల చట్టాలు తెస్తున్నందుకా..? ప్రభుత్వరంగ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నందుకా..? ఎందుకు మీకు ఓటు వేయాలో..? చెప్పాలన్నారు. రానున్న ఎన్నికల్లో దళితుల కోసం పనిచేస్తున్న టీఆర్ఎస్కు అండ గా ఉండాలని, గులాబీ జెండాను ఎగురవేయాలని అందుకు దళిత జాతి కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమం కో సం పాటుపడుతున్న సీఎం కేసీఆర్ నాయకత్వా న్ని బలపరుచుకుందామని విజ్ఞప్తి చేశారు. దళిత బంధు పథకం దళిత జాతికి అందుతున్న గొప్ప వరమని, దళితుల ఆర్థికాభివృద్ధికి ఈ పథకం తోడ్పడుతుందని ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పేర్కొన్నారు. ఇక్కడ ఎంపీపీ మమత, జడ్పీటీసీ శ్యాం, ప్రజాప్రతినిధులు, నాయకులు, దళిత నాయకులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.