పదవులిచ్చిన కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలేలా..?
దిగుజారుడుతనంతోనే ఈటల పిచ్చి ప్రేలాపనలు
ప్రజాక్షేత్రంలో పరాభవం ఖాయం
బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్రావు ధ్వజం
హుజూరాబాద్, జూన్18: కోళ్ల వ్యాపారం చేసుకొనే ఈటల రాజేందర్ను ఉద్యమ నేత కేసీఆర్ పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అసెంబ్లీకి పంపారు. అధికారంలోకి రాగానే మంత్రి పదవులిచ్చి ప్రోత్సహించారు..అలాంటి ఆయన తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా కేసీఆర్పై ఆహాంభావి, గోరికడుదాం అని విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్రావు ఆక్షేపించారు. అన్ని అనుభవించి పిచ్చిప్రేలాపనలు చేస్తున్న ఆయనకు ప్రజలే గోరి కడతారని హెచ్చరించారు. ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించే కేసీఅర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం దిగుజారుడు తనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, ఆసరా లాంటి పథకాలను అమలు చేస్తూ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు సన్నబియ్యంతో కడుపునిండా భోజనం పెడుతున్న ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టారీతిగా మాట్లాడడం దురదృష్టకరమన్నారు. హుజూరాబాద్ టీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈటల తాను నమ్ముకున్న ప్రజలను, కార్యకర్తలను నట్టేట ముంచి బీజేపీలోకి వెళ్లిపోయాడని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం హుజూరాబాద్ అభివృద్ధికి శ్రీకారం చుట్టడాన్ని చూసి ఎందుకు ఆక్రోశానికి గురవుతున్నాడో అర్థంకావడంలేదన్నారు. ఇన్నాళ్లు ఆయన పెండింగ్లో పెట్టిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నదని చెప్పారు. ప్రజలకు మేలు చేస్తుంటే తప్పుబట్టడం సరికాదన్నారు. సర్పంచులు, స్థానిక సంస్థల ప్రతినిధులను పక్కనబెట్టి ఎమ్మెల్యేలు ఆధిపత్యం చెలాయిస్తున్నారని తప్పుడు విమర్శలు చేయడం విచారకరమన్నారు. ప్రభుత్వం దౌర్జన్యం చేస్తున్నదని, పోలీసులతో తప్పుడు కేసులు పెడుతుందని తప్పుడు ఆరోపణలు చేస్తూ సానుభూతి పొందేందుకు యత్నిస్తున్నాడని మండిపడ్డారు. ఆయన జిమ్మిక్కులను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. ప్రజాస్వామిక పద్ధతుల్లో ప్రజాతీర్పును కోరేందుకు ముందుకురావాలని హితవు చెప్పారు. ముఖ్యమంత్రి, మంత్రులను నిందిస్తే ఓట్లు పడతాయని అనుకోవడం భ్రమేనన్నారు. ఈటల ఎన్ని కుట్రలు చేసినా ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న టీఆర్ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కరీంనగర్ కార్పొరేటర్ కృష్ణగౌడ్, టీఆర్ఎస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు ఐలయ్య, శ్రీనివాస్, సీనియర్ నాయకులు భూసారపు వెంకటేశ్, బాబురావు తదితరులు ఉన్నారు.