పథకాలను పరిగెతో పోల్చి ప్రజలను అవమానించినవ్
కేసీఆర్తోనే హుజూరాబాద్ పునర్నిర్మాణం
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు
వీణవంక, జూన్ 18: ధనిక రైతులకు రైతుబంధు వద్దని చెప్పిన మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఏ కోటాలో నీవు పెట్టుబడి సాయం తీసుకుంటున్నావని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు ప్రశించారు. పేదలకు ఎంతో మేలు చేస్తున్న ప్రభుత్వ పథకాలను పట్టుకొని ‘పరిగె’తో పోల్చి ప్రజలను అవమానించావని ధ్వజమెత్తారు. ఉద్యమనేత కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన సమయంలో ఈటల లేడని, పార్టీలోకి మధ్యలో వచ్చి మధ్యలోనే వెళ్లిపోయాడంటూ ఎద్దేవా చేశారు. ఈటల రాకముందే హుజూరాబాద్లో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని స్పష్టం చేశారు. వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి, కోర్కల్ గ్రామాల్లో శుక్రవారం ముఖ్యకార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్రెడ్డి, నారదాసు మాట్లాడారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఏడేండ్లు మంత్రిగా పనిచేసిన ఆయన హుజూరాబాద్ ప్రజలకు ఒరగబెట్టింలేదని మండిపడ్డారు.
సహజంగా వచ్చే పథకాలను తప్ప ప్రత్యేక పథకాలను ప్రజలకు అందించలేదని దుయ్యబట్టారు. ఆస్తుల మీద ధ్యాసపెట్టి అభివృద్ధిని విస్మరించారని నిప్పులు చెరిగారు. పచ్చని భూములను విధ్వంసం చేస్తూ, నల్ల చట్టాలతో రైతుల వెన్నువిరుస్తున్న బీజేపీలోకి ఎందుకు వెళ్లాడో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజలు ఆలోచించి ఇలాంటి అవకాశవాదులకు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్తోనే హుజూరాబాద్ పునర్నిర్మాణం సాధ్యమన్నారు. అందరూ సమన్వయంతో పనిచేసి పార్టీ గెలుపునకు కృషి చేయాలని కార్యకర్తలకు ఉద్బోధించారు. కొత్త ఎమ్మెల్యేను మీ చేతిలో పెట్టేదాకా మీకు ఎమ్మెల్యేగా పనిచేస్తానని పెద్ది సుదర్శన్రెడ్డి చెప్పారు. గ్రామాల్లో శరవేగంగా అభివృద్ధి పనులు జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాల-సాధవరెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మ్యాకల ఎల్లారెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు హమీద్, మాజీ జడ్పీటీసీ శ్రీదేవి, నాయకులు గెల్లు మల్లయ్య, ముద్దసాని సమ్మయ్య, పల్లెర్ల కిరణ్, మర్రి స్వామి, అడిగొప్పుల సత్యనారాయణ, మ్యాక వీరయ్య, మూల పుల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.