నల్ల చట్టాలు రూపొందించిన పార్టీలో ఎలా చేరినవ్
ప్రజా వ్యతిరేక విధానాలపై నిన్నటి దాకా విమర్శించింది మరిచావా..?
జమ్మికుంటలో మంత్రి కొప్పుల ఈశ్వర్
జమ్మికుంట, జూన్ 17: ఆత్మగౌరవం అంటూ ఆస్తులు కాపాడుకునేందుకు మతతత్వ పార్టీలో చేరిన మాజీ మంత్రి ఈటలకు ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠం తప్పదని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటలది ఆత్మ గౌరవం కాదని, ఆత్మవంచన అని, తన వ్యక్తిగత విషయాలను ప్రజలందరికీ రుద్దుతున్నాడని మండిపడ్డారు. ప్రజలను ఎమోషన్కు గురిచేస్తూ, రాజకీయ వ్యాపారం చేసేందుకు సిద్ధమయ్యాడని దుయ్యబట్టారు. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు ఆధ్వర్యంలో జమ్మికుంట ఎంపీఆర్ గార్డెన్లో గురువారం నిర్వహించిన టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీలో పదవులన్నీ అనుభవించిన ఈటల టీఆర్ఎస్ను ఎందుకు వీడి పోయాడో చెప్పాలని డిమాండ్ చేశారు.
నిన్నటి దాకా నల్ల చట్టాలు.. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టిన విషయాలను మరిపోయావా..? ఈటల అంటూ ఎద్దేవా చేశారు. నీకొక్కడికే ఆత్మ గౌరవం ఉందా..? మేం పార్టీలో నీతోనే పనిచేశాం కదా.. ఏనాడూ నీకు అన్యాయం జరిగిందని చెప్పలేదు కదా.. అని అడిగారు. బీజేపీ పాలిత ప్రాంతాలైన గుజరాత్, తదితర రాష్ర్టాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలను ఊచకోత కోసిన విషయాలను ప్రజలెలా మరిచిపోతారని అన్నారు. తన ప్రాణాలను పణంగాబెట్టి రాష్ర్టాన్ని తెచ్చిన సీఎం కేసీఆర్ వెంటే ప్రజలున్నారని తెలిపారు. ఇక ఈటల బీజేపీలో చేరగానే.. రాష్ట్ర అధ్యక్షుడు బండికి, ఎంపీ అర్వింద్కు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు చేస్తున్నారని, స్థాయిని మించి సీఎం కేసీఆర్ విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కటేనని, బీజేపీ, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో పథకాలు అమలు చేస్తున్నారా..? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రజల పార్టీ అని, సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం కేసీఆర్ వెంటే ప్రజలున్నారని తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే ఎజెండాగా ముందు కు సాగుతామని పేర్కొన్నారు. ఇక్కడ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, డీసీసీబీ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సంపత్, మల్లయ్య, వీరేశలింగం, కృష్ణమోహన్రావు పాల్గొన్నారు.