అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్
తాడికల్ సింగిల్ విండో పరిధిలోని కొనుగోలు కేంద్రం పరిశీలన
శంకరపట్నం, మే 17: వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకంలో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్ ఆదేశించారు. సోమవారం తాడికల్ సింగిల్విండో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రంలో నిల్వ ఉన్న ధాన్యం వివరాలను సింగిల్ విండో చైర్మన్ కేతిరి మధూకర్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. మొత్తం ఎనిమిది కొనుగోలు కేంద్రాల్లో 58 వేల క్వింటాళ్ల ధాన్యం తూకం వేయగా, మరో 15-20 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని చైర్మన్ ఏసీకి తెలిపారు. అలాగే హమాలీల కొరత వల్ల తూకంలో జాప్యం జరుగుతోందని చెప్పారు. గన్నీ బ్యాగులు, టార్పాలిన్ల కొరత లేదని తెలిపారు. ఇక్కడ ఏఈవో లక్ష్మీప్రసూన, కొనుగోలు కేంద్రం ఇన్చార్జి, సీఈవో వేణుమాధవ్, సహాయ సీఈవో వీరస్వామి, టీఆర్ఎస్ నాయకుడు కీసర సంపత్, రైతులు, తదితరులు ఉన్నారు.
మైనార్టీ గురుకుల పాఠశాలలో కొవిడ్ కేర్ సెంటర్
హుజూరాబాద్ టౌన్, మే 17: హుజూరాబాద్ పట్టణ శివారులో ఉన్న తెలంగాణ మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో ప్రత్యేక కొవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్లాల్ తెలిపారు. సోమవారం పట్టణంలో కొవిడ్ కేర్సెంటర్ ఏర్పాటు కోసం వివిధ భవనాలను పరిశీలించారు. అన్ని సౌకర్యాలు ఉండడంతో మైనార్టీ గురుకుల పాఠశాలను ఎంపిక చేశారు. మైనార్టీ పాఠశాలలోని తరగతి గదులు, మంచాలను శానిటేషన్ చేయించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఎవరైనా కరోనా సోకి సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడితే వెంటనే మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ అధికారులను సంప్రదించి కేర్ సెంటర్లో చేరాలన్నారు. కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారు ఎలాంటి అవసరం ఉన్నా కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ను సంప్రదించి తగిన సహాయ సహకారాలు పొందాలని అదనపు కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో సీహెచ్ రవీందర్రెడ్డి, తహసీల్దార్ ఎల్ రాంరెడ్డి, ఎంపీడీవో రమేశ్, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, కమిషనర్ కట్టంగూరి ప్రసన్నరాణి, పీహెచ్సీ వైద్యాధికారి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.