చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
బోయినపల్లి, జనవరి 17: తెలంగాణలోని దివ్యాంగులు, వయో వృద్ధులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని, వారి సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. సోమవారం బోయినపల్లి రైతు వేదికలో దివ్యాంగులు, వయోవృద్ధుల శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపకరణాలు పొందేందుకు 39 మంది వయోవృద్ధులు, 130 మంది దివ్యాంగులను ఎంపిక చేయగా, ఎమ్మెల్యే హాజరై వారికి ధ్రువీకరణ పత్రాలు అందించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దివ్యాంగులకు ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వం నెలకు రూ.3,016 పెన్షన్ ఇస్తున్నదని గుర్తు చేశారు. వృద్ధులు, అర్హులైన దివ్యాంగులకు ప్రభుత్వం ఉపకరణాలు అందించి వారిలో మనోధైర్యాన్ని నింపుతున్నదని పేర్కొన్నారు. అనంతరం స్తంభంపల్లిలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, తహసీల్దార్ స్వాతి, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కొనుకటి లచ్చిరెడ్డి, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యుడు కొట్టెపల్లి సుధాకర్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, సీడీపీవో ఎల్లయ్య, ఎంపీడీవో నల్ల రాజేందర్రెడ్డి, అడిషనల్ డీఆర్డీవో రవి, ఎంఈవో శ్రీనివాస్, ఐకేపీ ఏపీఎం నర్సయ్య, డీపీఎం పాపారావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, మండల ప్రధాన కార్యదర్శి గుంటి శంకర్, ఐసీడీఎస్ సూపర్వైజర్ అరుణ, సర్పంచులు గుంటి లతశ్రీ, చిందం రమేశ్, బూర్గుల నందయ్య, ఇల్లందుల శంకర్, కన్నం మధు, ఎంపీటీసీలు సంబ బుచ్చమ్మ, అక్కెనపల్లి ఉపేందర్ పాల్గొన్నారు.