అనుచరగణంతో కలిసి అధినేత కేసీఆర్ సమక్షంలో చేరిక
ఆయన వెంటే జమ్మికుంట కాంగ్రెస్ సీనియర్ నేత బింగి శ్రీధర్
జగిత్యాల రూరల్/జమ్మికుంట, జూలై 16: టీటీడీపీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ఎల్ రమణ శుక్రవారం తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరగా, ఆయన వెంటే జగిత్యాల జిల్లా ముఖ్య నాయకులు, అనుచరగణమంతా తరలివెళ్లింది. మూడు రోజుల క్రితం మంత్రి కేటీఆర్ సమక్షంలో ఎల్ రమణ పార్టీ సభ్యత్వం తీసుకోగా, శుక్రవారం ఆయనతో పాటు అనుచరులు కూడా టీఆర్ఎస్ కండువా కప్పుకొన్నారు.
పార్టీలోకి జమ్మికుంట కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీధర్
జమ్మికుంట పట్టణానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బింగి శ్రీధర్ శుక్రవారం హైదరాబాద్లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన శ్రీధర్ కుటుంబం పట్టణంతో పాటు నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు. శ్రీధర్ తండ్రి బింగి దామోదర్ ఆర్టీసీ ఉద్యోగి. నేషనల్ మజ్దూర్ సంఘంలో రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 1978లో ఇండిపెండెంట్గా కమలాపూర్ నుంచి పోటీ చేశారు. తర్వాత టీడీపీ వ్యవస్థాపకుల్లో ఒకరుగా ఉండేవారు. 1983లో దామోదర్కు ఎన్టీఆర్ టీడీపీ టికెట్ ఇవ్వగా ఓడిపోయారు. ఆయన మృతి తర్వాత కొడుకు శ్రీధర్ టీడీపీ, ప్రజారాజ్యం, టీ ప్రజారాజ్యం, కాంగ్రెస్లో పనిచేశారు. సీఎం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులైన శ్రీధర్, ఎల్ రమణతో కలిసి హైదరాబాద్లో టీఆర్ఎస్లో చేరారు.
బీజేపీ జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షుడి చేరిక..
బీజేపీ జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షుడు గుడాల రాజేశం గౌడ్ టీఆర్ఎస్లో చేరారు. శుక్రవారం ఎల్ రమణ చేరిన తర్వాత రాజేశం గౌడ్కు సీఎం కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, రమణతో తరలివెళ్లిన వారిలో నాయకులు దయాల మల్లారెడ్డి, వొల్లాల గంగాధర్, వనమాల నిరంజన్, కోరుకంటి రాము, ఏలేటి సురేందర్ రెడ్డి, కుడిక్యాల సర్వేశ్వర్, చెన్నమనేని కృష్ణారావు, గంప శ్రీనివాస్, ఎండీ రుక్కు, కూనమల్ల రాజం, తుమ్మనపెల్లి రమేశ్, పులి మల్లేశం గౌడ్, అనంతుల గంగారెడ్డి, జున్ను, మల్లయ్య, పొట్టవత్తిని చక్రపాణి, గుగ్గిళ్ల సత్యనారాయణ, వేముల శంకర్, అజ్గర్ ఖాన్, అజ్గర్షా తదితరులున్నారు.
బంగారు తెలంగాణలో భాగస్వామినవుతా..
దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నరు. ప్రజల కల సాకారం చేస్తున్నరు. అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తున్నరు. పాలన సాగిస్తున్నరు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఆకుపచ్చని తెలంగాణ చేస్తున్నరు. బంగారు తెలంగాణ దిశగా సాగుతున్నది. అందులో నేను భాగస్వామినవుతా. అందుకే టీఆర్ఎస్లో చేరుతున్నా. పార్టీలో పనిచేస్తా. పథకాలను ప్రజలకు చెబుతా. వచ్చే హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుంటం.