ఆస్తులపై ఉన్న ప్రేమ అభివృద్ధిపై లేదు
ముఖ్యకార్యకర్తల సమావేశం, విలేకరులతో మంత్రి గంగుల
హుజూరాబాద్, జూన్ 16: మాజీ మంత్రి ఈటలకు ఆస్తులపై ఉన్న ప్రేమ అభివృద్ధిపై లేదని, తన సొంత ప్రయోజనాలు, వ్యాపారం తప్ప నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడడానికి ఆయన వైఫల్యమే కారణమని మండిపడ్డారు. బుధవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని సిటీ సెంట్రల్లో పట్టణ టీఆర్ఎస్ నాయకులు, ముఖ్య కార్యకర్తల సమావేశంతోపాటు మున్సిపల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
మాజీ మంత్రి ఈటల ఏదో చేస్తాడని ప్రజలు అధికారాన్ని కట్టబెడితే ఏం పనులు కాలేదని, ఆయనకు ఆస్తులపై ఉన్న ప్రేమ అభివృద్ధిపై లేదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని సిటీ సెంట్రల్లో పట్టణ టీఆర్ఎస్ నాయకులు, ముఖ్య కార్యకర్తల సమావేశంతోపాటు మున్సిపల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాల అభివృద్ధి కుంటుపడడం కేవలం ఈటల రాజేందర్ వైఫల్యమేనని, ఆస్తులను రెగ్యులరైజ్ చేయించుకోవడానికి కేసీఆర్, కేటీఆర్ దగ్గరికి పదుల సార్లు వెళ్లిన ఈటల, ఇక్కడి పట్టణాల అభివృద్ధికి నిధులు ఎందుకు అడుగలేదో అర్థం చేసుకోవచ్చని దుయ్యబట్టారు. ఆయనకు మళ్లీ ఓటేస్తే పాతకథే పునరావృతం అవుతుందని, ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపిస్తే అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పారు.
ఎప్పుడు ఓటేసినా కేసీఆర్ బొమ్మ గుర్తు చేసుకోవాలని, ప్రగతి బాధ్యత టీఆర్ఎస్ చూసుకుంటుందని చెప్పారు. కేవలం ఈటల నిర్లక్ష్యంతోనే ఇవ్వాళ రెండు పట్టణాల్లో మిషన్ భగీరథ నీళ్లు సరఫరా కావడం లేదని మండిపడ్డారు. ఇక హుజూరాబాద్ పట్టణమైతే ఎటు చూసినా దుమ్ము, దూళితో రోడ్లు కనిపిస్తున్నాయని, గత పదేళ్లుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న ఈటల.. తన సొంత ప్రయోజనాలు, వ్యాపారం అభివృద్ధి చేసుకున్నాడే తప్ప నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఉండి నిధులు తెచ్చుకోలేని ఈటల.. బీజేపీలో చేరి నిధులు ఎలా తెస్తారని ప్రశ్నించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక జరిగే దాకా ఇక్కడే ఉంటానని, సమస్యలన్నీ పరిష్కరించాకే వెళ్తానని చెప్పారు. హుజూరాబాద్, జమ్మికుంటను అందరూ శభాష్ అనేలా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. మున్సిపల్కు కో ఆప్షన్ సభ్యులను నియమించుకోకపోవడం అత్యంత దురదృష్టకరమైన విషయమని, దీనిపై మాజీ మంత్రి ఈటల సమాధానం ఏంటో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. ఇక్కడ నాయకులు బండ శ్రీనివాస్, గందె రాధిక, కొలిపాక నిర్మల, కొలిపాక శ్రీనివాస్ ఉన్నారు.
టీఆర్ఎస్లోకి 50 మంది యువకులు
పట్టణంలోని 13వ వార్డు కౌన్సిలర్ కొండ్ర జీవిత ఆధ్వర్యంలో సమారు 50 మంది ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ నాయకులు మంత్రి గంగుల సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోగా, కండువా కప్పి ఆహ్వానించారు. కొండ్ర నవీన్, అజయ్, అరవింద్, మనోహర్, నిఖిల్, ప్రవీణ్కుమార్, రాకేశ్, రాజు, పవన్ ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసే పార్టీలో చేరామని, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకోసం పని చేస్తామని స్పష్టం చేశారు.
అభివృద్ధి గురించి ఏనాడైనా పట్టించుకున్నాడా: వొడితల సతీశ్కుమార్
మాజీ మంత్రి ఈటల హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాల అభివృద్ధి గురించి ఏనాడూ పట్టించుకోలేదని, కేవలం తన ఆస్తులు కాపాడుకునేందుకు స్వార్థ పూరితంగా వ్యవహరించేవాడని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ ఆరోపించారు. హుజూరాబాద్ పట్టణ అభివృద్ధికి అందరం కలిసికట్టుగా పనిచేద్దామని, ఇక నుంచి మంత్రి గంగుల కమలాకర్ తన వంతు కృషి చేస్తారని చెప్పారు. బీసీల కోసం గంగుల చాలా తాపత్రయ పడుతున్నారన్నారు. హుజూరాబాద్ను హైదరాబాద్లా తీర్చిదిద్దుతామని, త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. వచ్చే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ను బంపర్ మెజార్టీతో గెలిపించి, కేసీఆర్కు కానుకగా అందించాలని పిలుపునిచ్చారు.
వ్యక్తుల కన్నా పార్టీ గొప్పది: రసమయి
వ్యక్తుల కన్నా పార్టీ చాలా చాలా గొప్పదని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. హుజూరాబాద్కు టీఆర్ఎస్ పార్టీ పెట్టిన కోట అని, ప్రజలకు కారు గుర్తు, కేసీఆర్ మాత్రమే గుర్తుంటుందని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంట్లో అందుతున్నాయని చెప్పారు. ఈటలను హుజూరాబాద్ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, ఉప ఎన్నికల్లో ఆయనకు డిపాజిట్ కూడా రాదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ను, టీఆర్ఎస్ను విమర్శించే అర్హత ఈటలకు లేదని, కేవలం ఆస్తులు కాపాడుకోవడం తప్ప ప్రజల బాగోగులు ఆయనకు తెలియదని దుయ్యబట్టారు.
బీజేపీకి ఓటు అడిగే హక్కులేదు:బస్వరాజు సారయ్య
బీజేపీకి ప్రజలను ఓటు అడిగే హక్కులేదని, ఉప ఎన్నికల్లో ఎవరు పోటీ చేసినా వారికి డిపాజిట్ కూడా రాదని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య పేర్కొన్నారు. అలాంటి పార్టీలో ఈటల చేరడం దురదృష్టకరమని, తన ఆస్తులు కాపాడుకోవడానికి పార్టీ ఫిరాయించిన విషయం ప్రజలు గమనించాలని సూచించారు. కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న ఆయన, సంక్షేమ పథకాలు దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నాయని కొనియాడారు. దేశంలోనే అత్యంత ప్రజారంజక పాలన కేసీఆర్ నాయకత్వంలోనే జరుగుతున్నదని వివరించారు.