చిన్న తండా .. సకల వసతులు
ప్రణాళికాబద్ధంగా ముందుకు
పల్లెప్రగతితో అభివృద్ధి పథం
ఇప్పటి వరకు ఒకే ఒక్క కరోనా కేసు నమోదు
ఆదర్శంగా గుంటపల్లి చెరువు తండా
ఎల్లారెడ్డిపేట, మే 16: గుంటపల్లి చెరువు తండా మొత్తం జనాభా 326. మహిళలు 163 మంది, పురుషులు 163 మంది ఉన్నారు. 40 ఇళ్లు, 48 కుటుంబాలు ఉంటున్న ఊరిలో గ్రామ పంచాయతీగా ఏర్పడినప్పటి నుంచి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. సర్పంచ్ మాలోత్ సునీతతోపాటు పాలకవర్గాన్ని మొత్తం ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకుని ఆదర్శంగా నిలిచారు. ఏడాదికి రూ.6.48 లక్షల నిధులు వస్తుండగా పొదుపుగా ఖర్చు చేస్తూ స్వచ్ఛతకు పాటుపడుతున్నారు. చెత్త సేకరణకు ట్రాక్టర్ను కొనుగోలు చేసి, చిన్న పల్లె కావడంతో ఒక పారిశుధ్య కార్మికుడితో పనులు చేయిస్తున్నారు. చిన్న తండా అయినా డంప్ యార్డు, పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం నిర్మించుకొని అధికారుల మన్ననలు అందుకున్నారు. పల్లె ప్రగతిలో రెండు పాడుబడ్డ ఇండ్లను కూల్చి ప్రమాదాలకు చోటు లేకుండా చేసుకున్నారు. ఊరిలో 40 నివాసాలకు మిషన్ భగీరథ నీళ్లను అందిస్తున్నారు.
అందరి సహకారంతోనే…
అందరి సహకారంతోనే అభివృద్ధి చేసుకున్నం. పారిశుధ్య కార్మికుడు, గ్రామస్తులు ఊరిని శుభ్రంగా ఉంచేందుకు మాతో కలిసి పనిచేస్తున్నరు. చిన్న ఊరైనా పెద్ద ఊర్లకు ఉన్నన్ని వసతులున్నయి. ఇప్పటికైతే ఊల్లె ఒక్కటే కరోనా కేసు వచ్చింది. అదిగూడ సిన్నపిల్లగాడికి అచ్చి తగ్గిపోయింది. అది తప్ప మా ఊల్లె కేసులు గూడా లెవ్వు. గ్రామస్తులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నరు.
స్వచ్ఛతే అలవాటుగా..
పల్లె ప్రగతిలో ఊరి శుభ్రతకోసం నెల రోజుల పాటు ప్రతి వీధి, ఇల్లు శుభ్రంగా ఉంచేందుకు ఇచ్చిన నెల రోజుల కార్యాచరణ ఊరికి అలవాటుగా మారింది. కరోనా కష్టకాలంలో వీధుల్లో హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయించడం, వ్యక్తి గత పరిశుభ్రతపై అవగాహన కల్పించడం, మాస్క్లు ధరించడం, ఉపాధి పనుల్లో భౌతికదూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవడం వంటివి చేస్తున్నారు. దీంతో ఈ తండాలో కేవలం ఒకే ఒక్క కరోనా కేసు నమోదైంది. అది కూడా నెల రోజుల క్రితం ఓ బాలుడికి వచ్చి తగ్గిపోయింది. ఆ కేసు మినహా ఇప్పటివరకు ఒక్క కేసు నమోదు కాకపోవడంతో అధికారులు గ్రామస్తులను, గ్రామ పంచాయతీ పాలక వర్గ సభ్యులను ప్రశంసిస్తున్నారు.