ఆహార భద్రత హక్కుకు భంగం కలిగించొద్దు
నాణ్యత విషయంలో రాజీ పడొద్దు
రాష్ట్ర ఆహార భద్రతా కమిషన్ చైర్మన్ తిరుమల్రెడ్డి
ఎన్టీపీసీలో ఆహార భద్రతపై సమీక్షా
జ్యోతినగర్, జూలై 14: ఆహార నాణ్యత విషయంలో రాజీ పడవద్దని, ఆహార భద్రత హక్కుకు భంగం కలిగించవద్దని, జిల్లాలో ఆహార భద్రత చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఆహార భద్రతా కమిషన్ చైర్మన్ తిరుమల్రెడ్డి సూచించారు. బుధవారం ఎన్టీపీసీ ఈడీసీ మిలీనియం హాల్లో కలెక్టర్ ఆధ్వర్యంలో జాతీయ ఆహార భద్రతా చట్టం అమలుపై జిల్లా స్థాయిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా గర్భిణులకు పౌష్టికాహారం, కేసీఆర్ కిట్స్, లబ్ధిదారులకు రేషన్ పంపిణీపై చైర్మన్ ఆరా తీశారు. పేదలకు ఆహారం అందించడం కోసం ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నదని, జిల్లాలో ఆహార భద్రతా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, రేషన్ సరుకుల పంపిణీపై ఉన్నతస్థాయి అధికారులు తనిఖీలు నిర్వహించాలన్నారు. విజిలెన్స్ సరిగ్గా ఉంటేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన పథకం అందించే పాఠశాలల్లో నిరంతరం తనిఖీ చేసి ఆహార నాణ్యతను పరిశీలించాలని సూచించారు.
గర్భిణులు, బాలింతలకు, పసి పిల్లలకు మంచి పౌష్టికాహారం అందించే దిశగా అంగన్వాడీ కేంద్రాలు మంచి ఫలితాలు సాధించాలన్నారు. కరోనా నేపథ్యంలో అంగన్వాడీల పనితీరును అభినందించారు. ఆహార భద్రతా చట్టం అమలులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లాలో 413 చౌకధరల దుకాణాల ద్వారా 2,19,967 కుటుంబాలకు రేషన్ ఈపాస్ యంత్రాల ద్వారా ప్రతి నెలా 2,47,187 మెట్రిక్ టన్నుల బియ్యం, 12,170 కిలోల చక్కెర, 1,19,025 కిలోల గోధుమ, 21,996 కిలోల ఉప్పు, 68,898 లీటర్ల నూనె పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇక్కడ ఆహార భద్రతా కమిషన్ సభ్యులు వోరుగంటి ఆనంద్, ఎం భారతి, జడ్పీ చైర్మన్ పుట్టమధు, కలెక్టర్ సంగీత సత్యనారాయణ, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, ఆర్డీవోలు శంకర్కుమార్, కృష్ణవేణి, రామగుండం మున్సిపల్ కమిషనర్ ఉదయ్కుమార్, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, సీడీపీవోలు, రేషన్ డీలర్లు, తదితరులు ఉన్నారు.