ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
మండల సర్వసభ్య సమావేశం
పాల్గొన్న జడ్పీ చైర్పర్సన్ వసంత, గ్రంథాలయ చైర్మన్ చంద్రశేఖర్గౌడ్
మల్యాల, జూలై 14: పల్లె ప్రగతి కార్యక్రమంతో పల్లెలు పట్టణాలకు దీటుగా అభివృద్ధి చెందుతున్నాయని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. మండలకేంద్రంలోని రైతు వేదికలో ఎంపీపీ మిట్టపల్లి విమల అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సమావేశానికి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్తో కలిసి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు శాఖలపై సమీక్షలు నిర్వహించగా పలువురు సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. అనంతరం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ గాంధీ కలలు కన్న గ్రామ స్వరా ్యం సాధించేందుకు గానూ పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టారని అన్నారు. మల్యాల మండలంలో ప్రత్యేకంగా వరదకాలువ వెంబడి ఎగువకు లిప్ట్ ఇరిగేషన్లు, దిగువకు తూముల ద్వారా పంట పొలాలకు నీరు అందించేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారని, త్వరలో ప్రభుత్వ ఆమోదం రానుందని, ఆ తర్వా త వెంటనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఇప్పటికే చొప్పదండి నియోజకవర్గంలో ఒక వైపు మిడ్మానేరు జలాశయం, మరో వైపు గాయత్రీ పంప్హౌస్, ఇంకో వైపు రాంపూర్ పంప్హౌస్తో నీటిహబ్లా మారడంతోపాటు వరదకాలువ రిజర్వాయర్లా మారిందన్నారు. ఈనెల24వ తేదీన రాష్ట్ర మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మూడు కోట్ల మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామానికి కనీసం 1000 మొక్కలు నాటేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. గ్రంథాలయ చైర్మన్గా బాధ్యతలు చేపట్టాక మొదటిసారి మండలానికి వచ్చిన చంద్రశేఖర్ గౌడ్ను ఎంపీపీ మిట్టపల్లి విమల, జడ్పీటీసీ రామ్మోహన్రావుతో కలిసి సత్కరించారు. ఈ సమావేశంలో ఇన్చార్జి ఎంపీడీవో వాసవి, మార్కెట్ కమిటీ చైర్మన్ జనగాం శ్రీనివాస్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మిట్టపల్లి సుదర్శన్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.