కలెక్టర్ గుగులోత్ రవి
ప్రధానమంత్రి ఆహారశుద్ధి సూక్ష్మ కేంద్రాల ఏర్పాటుపై సమావేశం
జగిత్యాల కలెక్టరేట్, జూలై 12: సూక్ష్మ ఆహార శుద్ధి కేం ద్రాలను జిల్లాలో మహిళా సంఘాలతో విస్తృతంగా ఏర్పా టు చేసి, వారు ఆర్థికంగా వృద్ధి చెందే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గుగులోత్ రవి అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ఆహార శుద్ధి సూక్ష్మ కేంద్రాల ఏర్పాటుపై కలెక్టర్ సోమవారం జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ కింద కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసే సూక్ష్మ ఆహార శుద్ధి కేంద్రాలు, ప్రస్తుతం ఉన్న కేంద్రాల విస్తరణకు రానున్న ఐదు ఆర్థిక సంవత్సరాల్లో అందించేందుకు రూ.10 వేల కోట్లతో ప్యాకేజీని సిద్ధం చేసిందన్నారు. ప్రధాన మంత్రి ఆహార సూక్ష్మ శుద్ధి కేంద్ర పథకం కింద రూ.10లక్షల విలువ చేసే ప్రతి యూనిట్కు 35శాతం సబ్సిడీ, సొంత పెట్టుబడి 10శాతం, 55శాతం బ్యాంక్ లోన్ ఉంటుందన్నారు. జిల్లా స్థాయిలో దరఖాస్తులు స్వీకరించి వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత బ్యాంక్లకు అందించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఆహార శుద్ధి కేంద్రాల ఏర్పాటు పథకం కింద 35 దరఖాస్తులు వచ్చాయని, క్షేత్ర స్థాయిలో రిసోర్స్ అధికారులతో విచారణ చేపట్టి దరఖాస్తు దారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ పథకాన్ని వ్యక్తులు, ఎఫ్పీవో, మహిళా సంఘాలకు కూడా వర్తింపజేసే అవకాశం ఉంటుందన్నారు. వచ్చిన దరఖాస్తులను త్వరగా గ్రౌండింగ్ చేయాలన్నారు. సమావేశంలో డీఆర్డీవో వినోద్కుమార్, జిల్లా వ్యవసాయాధికారి సురేశ్కుమార్, పరిశ్రమల శాఖాధికారి, హార్టికల్చర్ ఆఫీసర్తోపాటు ఐతుపల్లి సర్పంచ్ జె.కొండయ్య, లీడ్ బ్యాంక్ మేనేజర్ లక్ష్మీనారాయణ, అంతర్గాం పసుపు ఎఫ్పీవో అధ్యక్షుడు నక్క రవీందర్, జగిత్యాల ధరణి ఎఫ్పీవో అధ్యక్షురాలు స్వరూప, నాబార్డు ప్రతినిధి అనంతపాట్న తదితరులున్నారు.
ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఇవ్వడం అభినందనీయం
కొవిడ్ బారిన పడిన వారి కోసం రెడ్ క్రాస్ సొసైటీ వారు ప్రభుత్వ దవాఖాన్లకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందజేయడం అభినందనీయమని కలెక్టర్ రవి పేర్కొన్నారు. రెడ్క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూ.2.50 లక్షల విలువైన ఐదు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను కలెక్టర్ చేతుల మీదుగా జిల్లాలోని మూడు ఆరోగ్యకేంద్రాలకు సోమవారం కలెక్టర్ చాంబర్లో అందజేశారు. రాయికల్, ధర్మపురి ఆరోగ్య కేంద్రాలకు రెండు, కొడిమ్యాల ఆరోగ్య కేంద్రానికి ఒకటి అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కొవిడ్ బాధితులకు అత్యవసర సమయంలో ఆక్సిజన్ అందించాల్సి వస్తుందని, రెడ్క్రాస్ సొసైటీ అందజేసిన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. జిల్లా వైద్యాధికారి పి.శ్రీధర్, రెడ్క్రాస్ సొసైటీ సభ్యులు, రాయికల్, ధర్మపురి, కొడిమ్యాల ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు పాల్గొన్నారు.