కరోనా బాధితుల్లో మనోధైర్యం నింపేందుకే ‘మీ కోసం మీ ఎమ్మెల్యే భరోసా యాత్ర’
విజయమ్మ ఫౌండేషన్ ద్వారా నిత్య భోజనం
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
గోదావరిఖని, మే 11: కరోనా బారి నుంచి ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిత్యం శ్రమిస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. కరోనా రెండో దశ విజృంభణ దృష్ట్యా రామగుండం ప్రాంతంలో వైరస్ బారిన పడిన ప్రజల్లో మనోధైర్యం నింపేందుకు ‘మీ కోసం మీ ఎమ్మెల్యే భరోసా యాత్ర’ చేపడుతున్నామని తెలిపారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొవిడ్ బాధితులకు తగిన వైద్య సదుపాయాలను కల్పించి అండగా నిలిచేందుకు ప్రభుత్వ దవాఖానలో 50 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. ఇంట్లో ఉండి చికిత్స పొందే అవకాశం లేనివారి కోసం గోదావరిఖని సప్తగిరి కాలనీలో ఐసొలేషన్ సెంటర్ను ప్రారంభించామన్నారు. ఇందులో విజయమ్మ ఫౌండేషన్ ద్వారా భోజన వసతి కల్పిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ దవాఖానలో కొవిడ్ బాధితులకు తగిన చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ప్రజలు వైరస్ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరికైనా కొవిడ్ ఇబ్బందులు ఉంటే 18005998666 నంబరుకు సమాచారం ఇవ్వాలన్నారు. అలాగే రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఎంతో అభివృద్ధి జరుగుతున్నా కొందరు వాట్సాప్ గ్రూపుల్లో అసత్య ప్రచారం చేయడం సరికాదన్నారు. మంచితనానికి మారుపేరుగా ఉన్న మంత్రి కొప్పుల ఈశ్వర్పై ఆరోపణలను ఖండిస్తున్నామని, ఆయన ప్రతిష్టను దెబ్బతీసేలా ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని పాలకుర్తి జడ్పీటీసీ అనుచరుడు బరుపటి నారాయణ ఫేస్బుక్లో పోస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. సమావేశంలో మేయర్ అనిల్కుమార్, కార్పొరేటర్లు పెంట రాజేశ్, దొంత శ్రీనివాస్, నాయకులు తానిపర్తి గోపాల్రావు, రాజు, గణేశ్ పాల్గొన్నారు.
ఐసొలేషన్ కేంద్రం సందర్శన: స్థానిక సప్తగిరి కాలనీలోని ఐసొలేషన్ సెంటర్ను ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న బాధితులకు విజయమ్మ ఫౌండేషన్ ద్వారా భోజనం అందజేశారు.