3 కోట్ల మెట్రిక్ టన్నులతో దేశంలోనే టాప్లో తెలంగాణ
మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే ప్రోత్సహించాలి
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి
కోరుట్లలో వ్యవసాయాధికారులతో సమీక్షా సమావేశం
కోరుట్ల, జూన్ 10: ఒకప్పుడు పంజాబ్ రాష్ట్రంలో అత్యధికంగా 2.2కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించే వారని, ప్రస్తుతం తెలంగాణ 3 కోట్ల మె ట్రిక్ టన్నుల దిగుబడితో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. గురువారం కోరుట్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు విద్యాసాగర్రావు, సంజయ్కుమార్, కలెక్టర్ రవి గుగులోత్తో కలిసి వ్యవసాయ విధా నం, అనుసారించాల్సిన పద్ధతులు, ఇతర అంశాలపై వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో భవిష్యత్ తరాలకు ఉపా ధి కల్పించేలా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు. రైతులు ఒకే రకమైన సాగు విధానానికి మొగ్గు చూపకుండా వ్యవసాయాధికారులు అవగాహన కల్పించాలన్నారు. పంటల సాగు ద్వారా రైతులు గడించిన అనుభవం, పరిజ్ఞానాన్ని పరిగణలోకి తీసుకొని వ్యవసాయరంగంలో నూతన ఒరవడి, మార్పులకు శ్రీకారం చుట్టాలన్నారు. రైతులు వరిలో సన్నాలు పండించే దిశగా ప్రోత్సహించాలని, మార్కెట్లో అధిక డిమాండ్ కలిగిన పంటలను సాగు చేసేలా తర్ఫీదు ఇవ్వాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తం గా నూనె గింజల ఉత్పత్తులకు అధిక డిమాండ్ ఉందని, రైతులు మూస పద్ధతిలో కాకుండా తక్కువ నీరు, విద్యుత్ వినియోగం తక్కువగా ఉండే లాభసాటి కందులు, మక్క పత్తి సాగుకు మొగ్గు చూపేలా అవగాహన కల్పించాలని సూచించారు.
ఎంతటి కష్టమైనా రైతులకు ఇబ్బందులు ఉండవద్దనే ఉద్దేశంతో వ్యవసాయరంగానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం కల్పిస్తూ ధాన్యం కొనుగోలు చేశారని గుర్తు చేశారు. ఆయిల్ ఫామ్ సాగు కోసం సాంకేతిక శాస్త్రవేత్తలు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటించి జగిత్యాల జిల్లా సాగుకు అనుకూలమని నివేదిక ఇచ్చారని తెలిపారు. 2022 నాటికి జిల్లాలో ఆయిల్ ఫామ్ అధికంగా సాగు చేసేలా చూడాలని అధికారులకు మంత్రి సూచించారు. రైతు వేదికల ద్వారా కాలనుగుణంగా వేయాల్సిన పంటలు పొందే లాభాలు, దిగుబడిపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. ఇతర రాష్ర్టాలు సాగు విధానంలో అనుసరిస్తున్న సాంకేతిక అంశాలను అధ్యయనం చేసేందుకు అధికారుల పర్యటనకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్కు మంత్రి సూచించారు. భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఉపాధి కల్పనకు దూర దృష్టితో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. మామిడి, జామ తోటలు వేసి అందులో కోళ్లు, గొర్రెలు, మేకలు, పాడి పశువులు పెంచాలన్నారు. వాటి ద్వారా వచ్చే గుడ్లు, పాలు, మాంసం అనుబంధ ఉత్పత్తులతో లాభాలు గడించవచ్చన్నారు. చక్కెర కార్మాగారాలను రైతులు స్వాతంత్య్రంగా నడుపుకున్నప్పుడే లాభాలు గడిస్తారని మంత్రి చెప్పారు.
మహారాష్ట్రలోని రైతులు అలాగే చేస్తున్నారని, మెట్పల్లి ప్రాంతంలోని చెరుకు రైతులు 30 వేలకు తగ్గకుండా సహకార సంఘంలో సభ్యులుగా చేరి కొంత మొత్తాన్ని బ్యాంక్లో డిపాజిట్ చేసుకొని సొంతంగా ఫ్యాక్టరీ నడుపుకుంటే లాభాలు దక్కుతాయన్నారు. సహకార సంఘాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తున్నదని ఆ దిశగా రైతులు ఆలోచన చేయాలని ఎమ్మెల్యే విద్యాసాగర్రావు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. జిల్లాలో యాసంగిలో 81,888 మంది రైతుల ద్వారా 5 లక్షల 41 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, రూ.1021 కోట్ల విలువైన ధాన్యం వివరాలను ఆన్లైన్లో నమోదు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు రైతులకు పంటకు సంబంధించి రూ.865 కోట్లు చెల్లించినట్లు వివరించారు. కాగా సమావేశానికి హాజరైన ఏవో, ఏఈవోలు తమ ప్రాంతాల్లో సాగవుతున్న పంటల వివరాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాల ద్వారా పెరిగిన ప్రత్యామ్నాయ పంట సాగు విధానంపై మంత్రికి వివరించారు. జిల్లాలో వ్యవసాయాధికారుల పనితీరుపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, ఆర్డీవో వినోద్కుమార్, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, మార్క్ఫెడ్ మాజీ అధ్యక్షుడు బాపురెడ్డి, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చీటి వెంకట్రావు. ఎంపీపీ తోట నారాయణ, ఏడీఏ రాంచందర్, డీఈ సురేష్, ఏఈ, ఏవోలతోపాటు తదితరులు పాల్గొన్నారు.