చేవరి ఆయకట్టుకూ కాళేశ్వరం జలాలు అందించాలి
చెక్డ్యాం నిర్మాణాల్లో వేగం పెంచాలి
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులు, చెక్డ్యాంల నిర్మాణాల ప్రగతిపై శుక్రవారం ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, చొప్పదండి, మానకొండూర్ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, కలెక్టర్ శశాంక, ఇరిగేషన్ ఇంజినీర్లతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వానకాలం పంటల సాగుకు నీరందించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. శ్రీ రాజరాజేశ్వర జాలాశయం ఎడమ కాలువ పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి, ఈ వానకాలంలో కాలువ కింది చెరువులన్నింటినీ నింపాలన్నారు. జిల్లాకు 33 చెక్డ్యాంలను ప్రభుత్వం మంజూరు చేసిందని, 50శాతం పనులు పూర్తయ్యాయని, మిగతావి త్వరగా పూర్తి చేయాలని ఇంజినీర్లకు సూచించారు. చెక్డ్యాంల నిర్మాణంతో భూగర్భజలాలు పెరుగుతాయన్నారు. కాళేశ్వరం జలాలను చివరి ఆయకట్టు వరకు అందించి బీడు భూములను సస్యశ్యామలం చేయాలన్నారు. ఎస్సారెస్పీ కాలువల లైనింగ్ చెడిపోయిన చోట వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. మానేరు రివర్ఫ్రంట్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఇరిగేషన్, ఎస్సారెస్పీ సీఈ శంకర్, పర్యవేక్షక ఇంజినీర్లు, డిప్యూ టీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, కరీంనగర్, హుజూరాబాద్ ఆర్డీవోలు ఆనంద్కుమార్, రవీందర్రెడ్డి పాల్గొన్నారు.
కాలువలు పూరి ్తచేయాలి
చొప్పదండి నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న కాలువలను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో గాయత్రీ, రాంపూర్ పంపుహౌస్లు ఉన్నా.. కొన్ని గ్రామాలకు సాగునీరు అందడం లేదని ఆవేదన చెందారు. మోతె రిజర్వాయర్కు బదులుగా నాలుగు ఓటీలు మంజూరు కాగా, భూసర్వే కూడా పూర్తయిందని చెప్పారు. నారాయణపూర్, పోతారం ఎడమ, కుడి కాలువ పనులను పూర్తి చేయాలని కోరారు. నారాయణపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసితులైన నారాయణపూర్, మంగపేట, చర్లపల్లి గ్రామస్తులకు పరిహారం అం దించాలన్నారు. దొంగలమర్రి వద్ద రైల్వేట్రాక్పై బ్రిడ్జిని నిర్మించి, అసంపూర్తిగా ఉన్న కాలువలను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని కోరారు.