అన్నదాతను ఆదుకోవడమే లక్ష్యం
వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్
మడిపల్లి, అంకుషాపూర్లో ముఖ్య కార్యకర్తల సమావేశం
జమ్మికుంట, ఆగస్టు 1: తమది రైతు ప్రభుత్వమని, అన్నదాతను ఆదుకోవడమే ప్రధాన లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ స్పష్టం చేశారు. ఆదివారం మడిపల్లి, అంకుషాపూర్ గ్రామాల్లో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు, రైతులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. కార్యకర్తలు, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతు బంధు, రైతు బీమా, పింఛన్లు, అభివృద్ధి పనుల వివరాలను అడిగారు. పనులకు సంబంధించిన వివరాలు తీసుకున్నారు. సీఎం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత వెంటనే మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. తర్వాత ఎమ్మెల్యే మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతులు, ప్రజలు పడ్డ కష్టాలను గుర్తు చేశారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు అందిస్తున్న దేశంలో ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో ఎరువుల కోసం రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు సరిపడా ఎరువులు, విత్తనాలు అందిస్తున్నామని చెప్పారు. రైతు బంధు పథకం కింద ఎకరాకు రూ.10వేలు అందిస్తున్నామని, మృతి చెందిన రైతు కుంటుంబానికి రైతు బీమా కింద రూ.5లక్షలు సీఎం ఇస్తున్నారని చెప్పారు. రైతు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని గుర్తు చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ఉచిత విద్యుత్ వద్దంటున్నదని, ధాన్యం కొనుగోలు చేయొద్దని ఆదేశాలిస్తున్నదని చెప్పారు. రైతు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న బీజేపీని ఆదరించొద్దని కోరారు. యువతకు ఒక్క ఉద్యోగం కూడా అందించలేదని ఆరోపించారు. బీజేపీకి వచ్చే ఉప ఎన్నికలో తగిన గుణపాఠం చెప్పాలని, అభివృద్ధి, సంక్షేమాన్ని ఉద్యమంలా చేస్తున్న టీఆర్ఎస్కు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ డాక్టర్ శ్యాం, అర్బన్ శాఖ అధ్యక్షుడు రాజ్కుమార్, మదన్, రాంబాబు, లింగారావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
గ్రామాభివృద్ధే లక్ష్యం
మండలంలోని అన్ని గ్రామాలతో పాటు ప్రత్యేకంగా పాపయ్యపల్లి అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఆదివారం సాయంత్రం ఆయన మండలంలోని పాపయ్యపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పాపయ్యపల్లి గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులను కలిశారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లోపు అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తానని వాగ్దానం చేశారు. తర్వాత ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వివరించారు. దేశంలో ఎక్కడా లేని పథకాలు సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. ‘దళిత బంధు’ దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వాగ్దానాలకు, మాటలకు సంతృప్తి చెందిన గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు, దళితులు, ప్రజలు ఒక్కతాటిపైకి వచ్చారు. దళిత బంధుతో పాటు పలు పథకాలు అమలు చేస్తున్న టీఆర్ఎస్కే తమ మద్దతుంటుందని హామీ ఇచ్చారు. పార్టీ గెలుపు కోసం అందరం కలిసి పనిచేస్తామని ప్రమాణం చేశారు.