జగిత్యాల: పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. హైదరాబాద్ తరహాలో జగిత్యాలలో నాలుగు వేలకు పైగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్కు దక్కుతుందని చెప్పారు. జిల్లాలోని నూకపెల్లిలో నిర్మిస్తున్న 4520 డబుల్ బెడ్రూం ఇండ్లను ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, సుంకె రవిశంకర్తో కలిసి కవిత పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. గతంలో ఇచ్చిన ఇండ్లు, టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిస్తున్న ఇండ్ల తేడాను ప్రజలు చూస్తున్నారు. ఎమ్మెల్యే సంజయ్ ఇండ్ల నిర్మాణాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని, పనులు త్వరగతిన పూర్తిఅయ్యేలా చూస్తున్నారని చెప్పారు.
జగిత్యాల జిల్లా కావాలనే దశాబ్దాల కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారన్నారు. ఇక్కడ చేపట్టిన ఇండ్ల నిర్మాణలు చూస్తే సీఎం సంతోషిస్తారని చెప్పారు. వచ్చే ఏడాది జూన్లోగా నిర్మాణలు పూర్తి చేసి పేదల సొంతింటి కలను నెరవేరుస్తామన్నారు. జగిత్యాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారని తెలిపారు. ఇచ్చినమాట ప్రకారం జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేశారని వెల్లడించారు. సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ కోసం ముఖ్యమంత్రితో మాట్లాడుతానని చెప్పారు.