జిల్లా ప్రభుత్వ దవాఖానలో సెంటర్
తాజాగా ఐసీఎంఆర్ అనుమతి
ముగ్గురు సైంటిస్టులు, సిబ్బంది నియామకం
నేటి నుంచి పూర్తి స్థాయిలో టెస్టులు
రోజుకు 300 మందికి పరీక్షలు చేసే సామర్థ్యం
ఉమ్మడి జిల్లా ప్రజలకు ప్రయోజనం
కరీంనగర్ విద్యానగర్, ఏప్రిల్ 29: కరోనా కట్టడి కోసం అహర్నిశలూ కృషిచేస్తున్న వైద్యశాఖ, అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నది. ఇన్నాళ్లూ హైదరాబాద్, వరంగల్లో మాత్రమే ఉన్న ఆర్టీపీసీఆర్ పరీక్షా కేంద్రాన్ని ఐసీఎంఆర్ అనుమతితో కరీంనగర్ జిల్లా దవాఖానలోనూ ఏర్పాటు చేసింది. ఇప్పటికే నిర్వహించిన డ్రైరన్ విజయవంతంకాగా, నేటి నుంచి పూర్తి స్థాయిలో టెస్టులు చేసేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. గతంలోనే టెస్టు చేసిన తర్వాత మూడు నుంచి ఐదు రోజుల్లో రిజల్ట్ రాగా, ఇప్పుడు ఒక్క రోజులోనే ఫలితం రానున్నది.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసుకునేందుకు ఐసీఎంఆర్ గురువారం అనుమతినిచ్చింది. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో భాగంగా జిల్లా కేంద్రంలో ఇన్నా ళ్లూ స్వాబ్ తీసి వరంగల్, హైదరాబాద్ ఐసీఎం సెంటర్లకు పంపించేవారు. రిజల్ట్ వచ్చే సరికి మూడు నుంచి ఐదురోజులు పట్టేది. వాస్తవానికి కరీంనగర్ దవాఖానలో ఆర్టీపీసీఆర్ పరీక్షా కేంద్రాన్ని గతంలోనే ఏర్పాటు చేశారు. అయితే ఐసీఎంఆర్ అనుమతి ఇవ్వకపోవడంతోనే ఇన్నాళ్లూ ప్రారంభం కాలేదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా రోజురోజుకూ పెరుగుతుండడంతో సెంటర్ ఏర్పాటు కోసం సర్కారు ప్రత్యేక చొరవ చూపింది.
ఈ మేరకు గురువా రం ఐసీఎంఆర్ అనుమతులు ఇచ్చింది. ము గ్గురు సైంటిస్టులు, ఆరుగురు టెక్నీషియన్లు, ముగ్గురు డాటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించింది. దాంతో అధికారులు గురువారం డ్రైరన్ నిర్వహించగా, విజయవంతమైంది. ఈసెంటర్కు రోజుకు 300మందికి పరీక్షలు చేసే సామ ర్థ్యం ఉంది. నేటి నుంచి పూర్తిస్థాయిలో టెస్టు లు చేయనుండగా, ఇక నుంచి ఒక్క రోజులోనే రిజల్ట్ వచ్చే అవకాశమున్నది. ఉమ్మడి జిల్లాలోని పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లా ప్రజలకు స్వాంతన కలుగనున్నది. అయితే జగిత్యాలలోనూ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.