న్యూఢిల్లీ: జూమ్.. ఈ కరోనా కాలంలో ఎన్నో కంపెనీలు, ఉద్యోగులు, చివరికి విద్యార్థులకు కూడా ఎంతో మేలు చేసింది. వర్క్ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ క్లాస్లకు ఇది బాగా ఉపయోగపడింది. అయితే అదే సమయంలో ఈ జూమ్ కాల్స్( Zoom Calls ) ఎంతో మంది ఉద్యోగాలు పోవడానికీ పరోక్షంగా కారణమైందని తాజాగా ఓ సర్వే తేల్చింది. ఇందులో భాగంగా 200 మంది మేనేజర్లతో మాట్లాడగా.. ప్రతి నలుగురిలో ఒకరు తాము తమ ఉద్యోగులను తొలగించినట్లు చెప్పడం గమనార్హం. మరి జూమ్ కాల్స్కూ, వీళ్ల ఉద్యోగాలు పోవడానికి సంబంధం ఏంటనేగా మీ డౌట్. అదే ఇప్పుడు చెప్పబోయేది.
ఏంటీ సర్వే?
వయోటా ఐఎన్సీ అనే సంస్థ ఈ సర్వే నిర్వహించింది. ఈ ఏడాది జులై 20 నుంచి ఆగస్ట్ 10 మధ్య ఈ సర్వే చేశారు. కనీసం 500 మంది ఉద్యోగులు ఉన్న కంపెనీల్లోని వైస్ప్రెసిడెంట్, అంతకు మించిన హోదాలో ఉన్న 200 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు.
సర్వే తేల్చిందేంటి?
జూమ్ కాల్స్కు ఈ మధ్య భారీగా డిమాండ్ పెరిగిపోయింది. 2019లో రోజుకు సగటున కోటి మంది ఈ జూమ్ కాల్స్లో పాల్గొనగా.. కరోనా ప్రారంభమైన తర్వాత ఇది మూడు కోట్లకు పెరిగింది. చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్న తమ ఉద్యోగులతో వీడియో కాల్స్ కోసం ఈ జూమ్నే ఉపయోగిస్తున్నారు. అయితే ఈ జూమ్ కాల్స్తోనే చాలా మంది ఉద్యోగులు అడ్డంగా దొరికిపోతున్నారు. ఆన్లైన్ మీటింగ్లకు ఆలస్యంగా రావడం, ఇంటర్నెట్ కనెక్షన్ సరిగా లేకపోవడం, సున్నితమైన సమాచారాన్ని అనుకోకుండా అందరితో షేర్ చేయడం, మ్యూట్లో ఉన్నామో లేదో చెక్ చేయకుండా నోరు జారడం, కెమెరా ఆఫ్ చేయకుండా ఏవో వ్యక్తిగత పనులు చేసుకోవడం వంటివి చేస్తున్నారు.
ఇలాంటి పనులు ఆయా బిజినెస్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీనికి కారణమైన వాళ్లు తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు. న్యూయార్క్లోని ఓ ప్రముఖ మ్యాగజైన్ రైటర్ జెఫ్రీ టూబిన్ ఇలాగే దొరికిపోయి ఉద్యోగం నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో చాలానే జరుగుతున్నాయి. సర్వేలో పాల్గొన్న ఎగ్జిక్యూటివ్లు ప్రతి నలుగురిలో ఒకరు జూమ్ కాల్స్లో ఇలాంటి పనులు చేసినందుకు తమ ఉద్యోగులను తీసేసినట్లు చెప్పడం గమనార్హం. అంతేకాదు ఆఫీస్లో కంటే రిమోట్గా పని చేసే తమ ఉద్యోగులు తమ పూర్తి సామర్థ్యం మేరకు పని చేయడం లేదని కూడా మేనేజర్లు భావిస్తున్నట్లు ఈ సర్వే తేల్చింది. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ను కొనసాగిస్తున్నారు.