న్యూఢిల్లీ: ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న వేళ వ్యాక్సిన్లే మానవాళిని గట్టెక్కిస్తాయని అన్ని దేశాలు బలంగా నమ్ముతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అంతటి కీలకమైన వ్యాక్సిన్లపై మేధో సంపత్తి హక్కులను ఎత్తేసే ఆలోచన చేస్తోంది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీవో). ఇందులోని దేశాల రాయబారులు బుధ, గురువారాల్లో సమావేశం కాబోతున్నారు. వ్యాక్సిన్లపై మేధో సంపత్తి హక్కులను ఎత్తేయడం వల్ల వాటిని మూడో ప్రపంచ దేశాలు స్వేచ్ఛగా తయారు చేసుకునే వీలు కలుగుతుంది. ఆ ఉద్దేశంతోనే గతేడాది అక్టోబర్లో ఈ ప్రతిపాదనను ఇండియా, సౌతాఫ్రికా డబ్ల్యూటీవో ముందు పెట్టాయి.
ఈ ప్రతిపాదనకు అభివృద్ధి చెందుతున్న దేశాలు, పాశ్చాత్య దేశాల్లోని కొందరు చట్టసభల ప్రతినిధులు మద్దతు తెలిపారు. కానీ అభివృద్ధి చెందిన దేశాలు, బలమైన ఫార్మాసూటికల్ కంపెనీలు ఉన్న దేశాలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. డబ్ల్యూటీవో నిబంధనల ప్రకారం దీనికి ఏకాభిప్రాయం కావాలి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. అగ్ర దేశాలను ఈ విషయంలో ఒప్పించడానికి దౌత్యపరమైన చర్చలు కొనసాగుతున్నాయి. అయితే గత నెలలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వంలోని అత్యున్నత వాణిజ్య అధికారి ఈ ప్రతిపాదనకు అనుకూలంగా మాట్లాడటం కాస్త ఆశలు రేపుతున్నాయి. వ్యాక్సిన్ల విషయంలో దేశాల మధ్య అసమానతలు ఆమోదయోగ్యం కాదని ఆ అధికారి అన్నారు.
వ్యాక్సిన్ల కొరత వేధిస్తున్న ఈ సమయంలో మేధో సంపత్తి హక్కులను కనీసం తాత్కాలికంగా ఎత్తేసినా ఎంతో మేలు చేస్తుంది. వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచడానికి ఇది తోడ్పడుతుంది. ఈ మహమ్మారిపై ప్రపంచం విజయం సాధించే వరకు అంటే కనీసం కొన్నేళ్లయినా మేధో సంపత్తి హక్కులను ఎత్తేయాలని పలు మూడో ప్రపంచ దేశాలు కోరుతున్నాయి.