సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తేతెలంగాణ): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బోనాల ఉత్సవాలకు సకల ఏర్పాట్లు చేయాలని దేవాదాయ,ధర్మాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అధికారులను ఆదేశించారు. బోనాల ఏర్పాట్లు, నిర్వహణపై మంగళవారం అరణ్యభవన్లో జరిగిన సమీక్షలో మంత్రులు పలు సూచనలు చేశారు. ఆలయాల వద్ద క్యూలైన్లు, నీటి సౌకర్యం ఉండాలని, భక్తులు తప్పనిసరిగా మాస్కు ధరించి,సామాజిక దూరం పాటించేలా చూడాలన్నారు. ఉత్సవాల నిర్వహణకు సీఎం కేసీఆర్ రూ.15 కోట్లు మంజూరు చేశారని, వీటిని ఆయా ఆలయ కమిటీలకు అందజేయాలన్నారు. అమ్మవార్ల ఆలయాలతోపాటు ప్రముఖ ప్రదేశాలను అలంకరించాలని సూచించారు. సమావేశంలో దేవాదాయశాఖ కమిషనర్ అనిల్కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతామహంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.