లండన్: బ్రిటన్లో ఇప్పుడు వింత పరిస్థితి నెలకొన్నది. ఓవైపు భారీ స్థాయిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు.. మరోవైపు ఆ ఉద్యోగాలకు సరిపడా నైపుణ్యం లేక మరో ఉద్యోగం దొరక్క లక్షల మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. యురోపియన్ యూనియన్ నుంచి బయటకు రావడం, ఏడాదిన్నర కాలంగా కరోనా మహమ్మారి కారణంగా బ్రిటన్ కంపెనీలు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి నానా తంటాలు పడుతున్నాయి. ఇప్పుడు లాక్డౌన్ నిబంధనలను సడలించడంతో మెల్లగా ఈ కంపెనీలు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తున్నా.. తమకు కావాల్సిన నైపుణ్యం ఉన్న వాళ్లు దొరకడం లేదు. 1200 వ్యాపారాలపై లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ చేసిన సర్వేలో ఐదో వంతు తమకు కావాల్సిన నైపుణ్యం ఉన్న వాళ్లు దొరకడం లేదని చెప్పాయి.
మరోవైపు ఉద్యోగాల వెబ్సైట్ అడ్జునా చేసిన మరో సర్వేలో 10 లక్షల వరకూ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తేలింది. ప్రతి ఉద్యోగానికి 2.2 మంది దరఖాస్తు చేసుకుంటున్నట్లు ఈ సంస్థ తెలిపింది. దీనిని బట్టి 16 నెలలుగా కరోనా కారణంగా విధిస్తున్న ఆంక్షలు, ఈయూ నుంచి వైదొలడం బ్రిటన్ లేబర్ మార్కెట్ను భారీగా దెబ్బ తీసినట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఆతిథ్య, తయారీ, నిర్మాణ రంగాలు తమకు కావాల్సిన నైపుణ్యాలను వెతుక్కోవడంలో ఇబ్బందులు పడుతున్నాయి.
ఇప్పుడే మేలుకొని దీనిపై తగిన విధంగా స్పందించకపోతే మాత్రం వచ్చే ఏడాది మరింత భారీగా వర్కర్ల కొరత ఏర్పడుతుంది. దీర్ఘకాల నిరుద్యోగిత వేధిస్తుంది. ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది అని ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంప్లాయ్మెంట్ స్టడీస్ డైరెక్టర్ టోనీ విల్సన్ స్పష్టం చేశారు. ఈ తాజా సర్వేలో బోరిస్ జాన్సన్ ప్రభుత్వానికి సవాలుగా మారాయి.
కొన్ని రంగాల్లో వర్కర్ల కొరత ఉండగా.. మరికొన్ని రంగాల్లో చాలా తక్కువ స్థాయిలో ఉద్యోగాలు ఖాళీగా ఉండటం గమనార్హం. ఇది నిరుద్యోగులను సంఖ్యను మరింత పెంచుతోంది. నైపుణ్యాల కొరత ఉన్న ఉద్యోగాలను గుర్తించి, వాటి కోసం ప్రత్యేకంగా యువతకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని పారిశ్రామిక వర్గాలు కోరుతున్నాయి. మాంసాన్ని ప్రాసెస్ చేసేవాళ్లు, ఇటుకలు తయారు చేసే వాళ్లు, వెల్డర్లకు తీవ్ర కొరత ఉంది. ఇలా వర్కర్ల కొరత ఉన్న మరిన్ని వృత్తులను గుర్తించి వాటికి ఇమ్మిగ్రేషన్ నిబంధనలను సరళతరం చేసే ఆలోచన కూడా బ్రిటన్ చేస్తుండటం విశేషం.