కాబూల్: అమెరికా సైన్యం వెనుతిరిగిన తర్వాత మెరుపు వేగంతో ఆఫ్ఘనిస్థాన్ను వశం చేసుకున్న తాలిబన్లు తమ అణచివేత విధానాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా రాజధాని కాబూల్లో మహిళలపై వివక్షా పూరిత నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయి. మొన్నామధ్య కాబూల్ మున్సిపాలిటీలో ఉద్యోగాలు చేసే మహిళలను ఇంటికే పరిమితం చేస్తూ అక్కడి మేయర్ నిర్ణయం తీసుకున్నాడు.
ఇప్పుడు కాబూల్ యూనివర్సిటీలో తాలిబన్లు నియమించిన ఛాన్సలర్ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకొని వార్తల్లో నిలిచాడు. యూనివర్సిటీలోకి తరగతులకు హాజరవడానికి, పని చేయడానికి మహిళలను అనుమతించబోమని వర్సిటీ ఛాన్సలర్ మహమ్మద్ అష్రాఫ్ ఘైరాట్ ప్రకటించారు. ‘‘అందరికీ నిజమైన ఇస్లాం వాతావరణం అందించే వరకూ వారిని అనుమతించబోం’’ అని అష్రాఫ్ తెలిపారు.
ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయన వెల్లడించారు. కొన్నిరోజుల క్రితం వర్సిటీలో ప్రో-తాలిబన్ కార్యక్రమం జరిగింది. దీనికి తల నుంచి పాదాల వరకూ పూర్తిగా నల్లని దుస్తులతో కప్పుకొని మహిళలు కూడా హాజరయ్యారు.