న్యూయార్క్ : ఒన్ మిలియన్ లాటరీ టికెట్ ను కొనుగోలు చేసి బంపర్ ప్రైజ్ తనకు రాలేదనే నిరాశతో టికెట్ ను అక్కడే పడవేసి వెళ్లిన మహిళకు రూ 7 కోట్ల జాక్ పాట్ తగిలింది. అమెరికాలోని మసాచుసెట్స్ కు చెందిన మహిళ లీ రోజ్ ఫిగా స్థానిక స్టోర్ లో ఒన్ మిలియన్ లాటరీ టికెట్ ను కొనుగోలు చేసింది. ఆపై తనకు ప్రైజ్ రాలేదనే అనుమానంతో దాన్ని అక్కడే పడేసి వెళ్లిపోయింది. తాను హడావిడిగా లంచ్ చేస్తూ టికెట్ ను స్క్రాచ్ చేశానని ఆ నెంబర్ కు లాటరీ రాలేదని అక్కడే విసిరేసి వెళ్లానని లీ గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత కౌంటర్ వెనుక టికెట్ ను స్టోర్ యజమాని కుమారుడు అభి షా గుర్తించాడు.
పది రోజుల పాటు ఆ టికెట్ అక్కడే ఉందని ఓ సాయంత్రం దాన్ని పరిశీలించగా అసలు సదరు మహిళ స్క్రాచ్ చేయలేదని తెలిసింది. తాను నెంబర్ ను స్క్రాచ్ చేయగా రూ 7 కోట్ల లాటరీ ఆ నెంబర్ కే వచ్చినట్టు వెల్లడైందని స్థానిక టీవీ చానెల్ కు అభి షా తెలిపారు. ఇక లీని వెతుక్కుంటూ ఆమె ఆఫీస్ కు వెళ్లి ఆమె తల్లితండ్రులు స్టోర్ వద్ద వేచిచూస్తున్నారని షా చెప్పాడు. అక్కడకు వచ్చిన మహిళ రూ 7 కోట్ల ప్రైజ్ తనకు వచ్చినట్టు తెలుసుకుని తల్లితండ్రులతో సంతోషం పంచుకున్నారు. స్టోర్ యజమానికి లాటరీ కమిషన్ వస్తుందని తెలిసినా వారి నిజాయితీకి మెచ్చి షా కుటుంబానికి అదనపు బోనస్ ఇచ్చేందుకు లీ సిద్ధమైంది.