లండన్: మరణించిన వ్యక్తి దంతాలు పీకి దగ్గరి బంధువులకు పంపిణీ చేసే వింత ఆచారం బ్రిటన్లో వెలుగు చూసింది. వేల్స్కు చెందిన ఒక ఉన్నత కుటుంబంలో ఈ ఆచారం తరతరాలుగా కొనసాగుతున్నది. ఇటీవల ఆ కుటుంబానికి చెందిన ఒకరు మరణించారు. దీంతో చనిపోయిన వ్యక్తి పళ్లు తొలగించి బంధువులకు ఇచ్చే భర్త కుటుంబ ఆచార కార్యక్రమానికి వెళ్లేందుకు ఒక మహిళ నిరాకరించింది. ‘ఇది ఒక సాంస్కృతిక విషయం అని నేను అనుకోవడం లేదు. దానికి సరైన ఆధారాన్ని కనుగొనలేకపోయాను. లేదా సాంస్కృతిక, మతపరమైన నేపథ్యం నుండి రిమోట్గా ఇలాంటిదేమీ కనుగొనలేకపోయాను’ అని రెడ్డిట్లో ఆమె పేర్కొంది.
ఈ ఆచారం ప్రకారం మరణించిన బంధువు దంతాలు పెకలించి ప్రతి బంధువుకు ఒకటి ఇస్తారని ఆ మహిళ తెలిపింది. ప్రతి కుటుంబం వద్ద ఉండే ఒక ఫాబ్రిక్ పర్సులో దాచుకునేందుకు చనిపోయిన వ్యక్తికి చెందిన ఒక పంటిని ఇస్తారని, వారు దానిని అందులో ఉంచుకోవాలని ఆమె చెప్పింది. చనిపోయిన బంధువుతో ఉన్న అనుబంధం మేరకు ఏ కుటుంబానికి ఏ పన్ను ఇవ్వాలన్న నియమాన్ని కూడా వారు పాటిస్తారని వివరించింది. ఇలా జీవితకాలంలో మరణించిన వారి బంధువుల నుంచి సేకరించిన వేలాది మానవ దంతాలతో ఈ పర్సు నిండిపోతుందని ఆమె వెల్లడించింది.
కాగా, తన భర్త నానమ్మ చనిపోవడంతో ఆమె అంత్యక్రియలకు వెళ్లగా ఈ వింత ఆచారం గురించి తనకు తెలిసిందని ఆ మహిళ చెప్పింది. తన భర్త నానమ్మ దంతాన్ని తన అత్త ఒక పర్సులో పెట్టి తనకు ఇవ్వబోగా తీసుకునేందుకు తాను నిరాకరించడంపై తన భర్త కోపగించుకున్నారని ఆమె తెలిపింది. తాను చనిపోయినప్పుడు కూడా తన పళ్లను పీకి కుటుంబ సభ్యులకు పంచుతారన్న ఊహను తాను భరించలేకపోయానని వాపోయింది.
చనిపోయిన తర్వాత తన పిల్లలకు ఈ ఆచారాన్ని గుర్తుచేసే సామర్థ్యాన్ని లేదా వారి బంధువులకు సంబంధించిన ఈ ఆచారం, సంప్రదాయం నుండి దూరంగా ఉంచుతావా అని భర్త తనను ప్రశ్నించినట్లు ఆ మహిళ చెప్పింది. తన భర్త కుటుంబం ఎంతో ప్రేమగా ఉంటుందని, అయితే ఇది పిచ్చి ఆచారంగా తనకు అనిపిస్తున్నదని ఆమె పేర్కొంది. ఈ ఆచార వేడుకలో పాల్గోనందుకు తనకు విడాకులు ఇచ్చే ఆలోచనలో తన భర్త ఉన్నట్లు ఆ మహిళ వివరించింది. మరోవైపు ఆమె పోస్ట్ను చదివిన కొందరు ఆమె చర్యను సమర్థించగా మరి కొందరు తప్పుపట్టారు.