కాబూల్: మహిళలు ఇంటికే పరిమితం కావాలన్నది ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లోని తాలిబన్ల సిద్ధాంతం. కానీ అలాంటి ఓ తాలిబన్ లీడర్నే ఆమె లైవ్ టీవీ చానెల్లో ఇంటర్వ్యూ చేసింది. అయితే ఇప్పుడామె దేశం విడిచి వెళ్లిపోయింది. బెహెస్తా అర్ఘాండ్ అనే ఆ 24 ఏళ్ల జర్నలిస్ట్ టోలో న్యూస్ చానెల్లో పని చేస్తోంది. ఈ నెల 15న తాలిబన్లు మళ్లీ దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న రెండు రోజుల తర్వాత అంటే ఆగస్ట్ 17న ఓ తాలిబన్ సీనియర్ నేతను బెహెస్తా ఇంటర్వ్యూ చేసింది. కాబూల్లో తాలిబన్లు ఇంటింటికీ తిరుగుతూ సోదాలు చేయడం, వాళ్ల భవిష్యత్తు ప్రణాళిక గురించి ఆమె పలు ప్రశ్నలు అడిగింది.
ఓ ఆఫ్ఘన్ న్యూస్ నెట్వర్క్లో ఓ తాలిబన్ను ఇంటర్వ్యూ చేసిన తొలి మహిళా జర్నలిస్ట్గా ఆమె చరిత్ర సృష్టించింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆమె రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. అయితే ఇప్పుడదే తాలిబన్ల భయంతో ఆమె ఆఫ్ఘనిస్థాన్ను వీడింది. తాను నెలా 20 రోజులు టోలో న్యూస్లో పని చేశానని, అప్పుడే తాలిబన్లు మళ్లీ అధికారంలోకి వచ్చారని ఆమె సీఎన్ఎన్కు చెప్పింది.
అయితే తాలిబన్లు తాము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే తాను తిరిగి స్వదేశానికి వస్తానని బెహెస్తా అంటోంది. ఈ ఇంటర్వ్యూలో టోలో న్యూస్కు కూడా మంచి పేరు వచ్చినా.. ఇప్పుడు తమ చానెల్లోని టాప్ జర్నలిస్టులంతా దేశం విడిచి వెళ్లిపోతున్నారని చానెల్ సీఈవో సాద్ మొహసెని చెప్పారు. బెహెస్తా తాలిబన్ లీడర్నే కాదు.. అంతకుముందు వాళ్ల చేతుల్లో హత్యాయత్నానికి గురైన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలాను కూడా ఇంటర్వ్యూ చేసింది. ఆఫ్ఘన్ టీవీలో మలాలా ఇంటర్వ్యూ రావడం ఇదే తొలిసారి.