బొంరాస్పేట, ఏప్రిల్ 9 : అర్హులైన ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా తీసుకోవాలని వైస్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్గౌడ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకా తీసుకుని మాట్లాడారు. కరోనా నిర్మూలనకు టీకా ఒక్కటే మార్గమన్నారు. శుక్రవారం పీహెచ్సీలో 140 మందికి టీకా వేశామని మండల వైద్యాధికారి రవీంద్ర యాదవ్ తెలిపారు. పలువురు ఉపాధ్యాయులు, ప్రజలు టీకా తీసుకున్నారు. మండలంలోని చిల్ముల్మైలారం గ్రామానికి చెందిన ఆవుటి రాజ్కుమార్ కుటుంబ సభ్యులు 10 మంది టీకా తీసుకున్నారు. పీహెచ్సీలో 142 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 9 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారి తెలిపారు.
జోరుగా కొవిడ్-19 వ్యాక్సిన్
ధారూరు, ఏప్రిల్ 9 : మండల పరిధిలోని 45 ఏండ్లు పైబడిన వారు కొవిడ్-19వ్యాక్సిన్ వేయించుకోవాలని ధారూరు, నాగసముందర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు రాజు, రమేశ్ బాబు తెలిపారు. శుక్రవారం ధారూరు మండలానికి చెందిన 150మందికి, నాగసముందర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 79మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు.
కొడంగల్లో 9 మందికి..
కొడంగల్, ఏప్రిల్ 9 : పట్టణంలోని కార్గిల్, లాహోటీ, ఐనాన్పల్లితో పాటు చిట్లపల్లి గ్రామంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రావణి మాట్లాడుతూ 9మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్యాధికారి వీణ, గోపాల్ పాల్గొన్నారు.
టీకా తీసుకోవాలి
బంట్వారం, ఏప్రిల్ 09 : కొవిడ్-19 టీకాను తప్పనిసరిగా తీసుకోవాలని ఎంపీడీవో బాలయ్య అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. నేటి నుంచి ప్రభుత్వ దవాఖానలో ఉచితంగా టీకాను వేస్తారన్నారు. ప్రజాప్రతినిధులతో పాటు కార్యదర్శులు ప్రజలు టీకా తీసుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు.
కరోనాను తరిమేందుకు టీకా
కోట్పల్లి ఏప్రిల్ 9 : కరోనాను తరిమేందుకు అందరం నడుంబిగించాలని ఎంపీడీవో లక్ష్మీనారాయణ అన్నారు. నేటి నుంచి 45 ఏండ్ల పైబడిన వారు పెద్దెముల్, బంట్వారం మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పీహెచ్సీల్లో కరోనా టీకాను వేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. విషయాన్ని గ్రామాల్లో అవగాహన కల్గించేందుకు గ్రామాల్లో చాటింపు వేయించాలన్నారు. టీకాపై అపోహలు వద్దన్నారు.
మాస్కు ఉంటేనే సరుకులు
బొంరాస్పేట, ఏప్రిల్ 9 : కిరాణా దుకాణాలకు వచ్చే వినియోగదారులు మాస్క్ ధరించి వస్తేనే సరుకులు ఇవ్వాలని కొడంగల్ సీఐ అప్పయ్య దుకాణదారులకు సూచించారు. శుక్రవారం సాయంత్రం ఆయన తుంకిమెట్లలో వ్యాపారులు, ఆటో డ్రైవర్లకు కరోనాపై అవగాహన కల్పించారు. కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించి, చేతులు శుభ్ర చేసుకోవాలన్నారు. కొవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ఆటో డ్రైవర్లు కూడా ఆటోల్లో ప్రయాణికులందరూ మాస్క్ ధరించేలా చూడాలని ఆదేశించారు.
ఇవీ కూడా చదవండి…
జీవన ఎరువులతో దిగుబడులు సాధించాలి