వాషింగ్టన్: తాము కోవిడ్తో సతమతం అవుతున్న వేళ భారత్ అందించిన సహాయాన్ని ఎన్నటికీ మరిచిపోలేమని అమెరికా పేర్కొన్నది. భారత విదేశాంగ శాఖ ఎస్ జైశంకర్.. అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆయన్ను కలిశారు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ దేశాన్ని విజిట్ చేసిన తొలి భారతీయ మంత్రి ఆయనే. కోవిడ్ వ్యాప్తి చెందుతున్న తొలి రోజుల్లో అమెరికాకు ఇండియా అండగా నిలిచిందని, ఆ దేశం అందించిన సహాయాన్ని తామెన్నటికీ మరిచిపోలేమని బ్లింకెన్ అన్నారు. ఇప్పుడు, ఈ దశలో ఇండియాకు అండగా తాము ఉన్నామని బ్లింకెన్ వెల్లడించారు.
కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ అమెరికాలో రిపోర్టర్లతో మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య చర్చించేందుకు అనేక అంశాలు ఉన్నాయని, మన మధ్య ఉన్న బంధం మరింత బలపడినట్లు భావిస్తున్నానని, ఇది ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు. విపత్కర సమయంలో అమెరికా ఇచ్చిన మద్దతు, సహకారం, సంఘీభావానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు జైశంకర్ అన్నారు. సమకాలీన పరిస్థితుల్లో ఎదురవుతున్న ఎన్నో సవాళ్లను అమెరికా, ఇండియా సంయుక్తంగా స్పందిస్తున్నట్లు బ్లింకెన్ తెలిపారు. కోవిడ్19ను నిర్మూలించేందుకు కలిసి కట్టుగా పనిచేస్తున్నామన్నారు.