మాస్కో: బ్రిటన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది రష్యా. క్రిమియా తీరంలో మరోసారి బ్రిటిష్ నేవీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే నల్ల సముద్రంలోని మీ నేవీ నౌకలపై బాంబులు వేస్తాం అని హెచ్చరించింది. ఇప్పటికే మాస్కోలని బ్రిటన్ అంబాసిడర్ దెబోరా బ్రెనెర్ట్కు రష్యా సమన్లు కూడా జారీ చేసింది. బ్రిటన్ యుద్ధ నౌక తమ జలాల్లోకి వచ్చిందని రష్యా ఆరోపిస్తోంది. అయితే ఇవి ఉక్రెయిన్కు చెందిన జలాలని బ్రిటన్ సహా ప్రపంచంలోని మెజార్టీ దేశాలు వాదిస్తున్నాయి. తమ యుద్ధనౌక మార్గంలో రష్యా బాంబులేసిందని బ్రిటన్ ఆరోపిస్తుండగా.. రష్యా మాత్రం తాము ఎలాంటి వార్నింగ్ షాట్లు, ఎలాంటి బాంబులు వేయలేదని చెబుతోంది.
బ్రిటన్ దారుణమైన అబద్ధాలు చెబుతోందని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జక్రోవా అన్నారు. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ అది వర్కవుట్ కాకపోతే బాంబులేస్తాం అని రష్యా డిప్యూటీ విదేశాంగ మంత్రి సెర్గీ రియాబ్కోవ్ హెచ్చరించారు. బ్రిటన్ యుద్ధనౌక మార్గంలో బాంబులేశారట కదా అని ప్రశ్నిస్తే.. భవిష్యత్తులో మార్గంలో కాదు, టార్గెట్పైనే వేస్తామని అనడం గమనార్హం.
మధ్యధరా ప్రాంతంలో తమ ఆధిపత్యాన్ని చాటడానికి నల్ల సముద్రాన్నే మార్గంగా రష్యా ఎంచుకుంది. ఈ విషయంలోనే కొన్ని శతాబ్దాలుగా రష్యా, తన ప్రత్యర్థులు టర్కీ, ఫ్రాన్స్, బ్రిటన్, యూఎస్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. 2014లో ఉక్రెయిన్ నుంచి క్రిమియా ద్వీపాన్ని స్వాధీనం చేసుకున్న రష్యా.. దాని చుట్టూ ఉన్నవి తమ జలాలుగా ప్రకటించుకుంది. అయితే పాశ్చాత్య దేశాలు మాత్రం క్రిమియా ఇప్పటికీ ఉక్రెయిన్లో భాగమేనని స్పష్టం చేస్తున్నాయి.