ఆఫ్ఘనిస్థాన్ ( Afghanistan ) మరోసారి రగులుతోంది. రెండు దశాబ్దాల పాటు అమెరికా సేనలు అక్కడే తిష్ట వేయడంతో గాడిన పడిన ఆ దేశం.. ఇప్పుడు అగ్రరాజ్య దళాలు వెనుదిరుగుతుండటంతో మరోసారి రాక్షస తాలిబన్ల ( Taliban ) చేతుల్లోకి వెళ్లిపోతోంది. ఆఫ్ఘన్ సాయుధ దళాలపై పైచేయి సాధిస్తూ.. మారణహోమం సృష్టిస్తూ.. మెల్లగా ఆ దేశంలోని ఒక్కో కీలక ప్రాంతాన్ని మరోసారి తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన కాందహార్ వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు రాజధాని కాబూల్ కూడా అతి త్వరలోనే వాళ్ల వశమయ్యే అవకాశం ఉండటంతో అక్కడి ప్రభుత్వం.. అధికారాన్ని పంచుకుందామంటూ తాలిబన్లకు రాయబారం పంపింది. ఈ నేపథ్యంలో అసలు ఆఫ్ఘనిస్థాన్లో ఏం జరుగుతోంది? ఎవరీ తాలిబన్లు? ఈ స్థాయికి ఎలా వచ్చారన్నది ఓసారి చూద్దాం.
1989లో పష్తూన్ తెగకు చెందిన ముల్లా మొహమ్మద్ ఒమర్ దక్షిణ ఆఫ్ఘనిస్థాన్లో ఈ తాలిబన్ గ్రూప్ను ప్రారంభించాడు. ముజాహిదీన్ కమాండర్గా మారిన అతడు.. ఆ ఏడాది సోవియట్లను దేశం నుంచి తరిమివేయడంలో కీలకంగా వ్యవహరించాడు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్థాన్లో మొదలైన సివిల్ వార్తో ఈ తాలిబన్లు బలపడ్డారు. 1994లో కాందహార్ చేరిన ముల్లా.. 50 మంది అనుచరులతో ఓ గ్రూప్ ఏర్పాటు చేశాడు. అక్కడి నుంచి తన సంస్థను బలోపేతం చేసుకుంటూ వెళ్లిన ముల్లా.. రెండేళ్లలోనే కాందహార్తోపాటు రాజధాని కాబూల్ను కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
రాజకీయ అస్థిరత, ప్రజల్లో నెలకొన్న భయాన్ని ఆసరాగా చేసుకొని తాలిబన్లు చాలా వేగంగా దేశం మొత్తం విస్తరించారు. అప్పటి నుంచీ దేశంలో కఠినమైన ఇస్లామిక్ నిబంధనలను అమలు చేశారు. టీవీలు, మ్యూజిక్ బంద్ చేశారు. బాలికలను స్కూళ్లకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడిలో ప్రధాన సూత్రధారి అయిన ఒసామా బిన్ లాడెన్కు ఈ తాలిబన్లే ఆశ్రయం కల్పించారు. అతన్ని తమకు అప్పగించాల్సిందిగా అమెరికా డిమాండ్ చేసినా తాలిబన్లు వినకపోవడంతో.. ఇక అగ్రరాజ్య దళాలు ఆ దేశంలో అడుగుపెట్టాయి. దీంతో ముల్లా ఒమర్, మిగతా తాలిబన్ లీడర్లు ఆఫ్ఘన్ నుంచి పారిపోయి పాకిస్థాన్లో తలదాచుకున్నారు. 2001 నుంచి ఇప్పటి వరకూ అమెరికా దళాలు ఆఫ్ఘనిస్థాన్లోనే ఉన్నాయి.
గతేడాది ఫిబ్రవరిలో అమెరికా, తాలిబన్ల మధ్య ఓ చారిత్రక ఒప్పందం కుదిరింది. వచ్చే 14 నెలల్లో ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాలు పూర్తిగా వెనక్కి వెళ్లాలని ఈ ఒప్పందంలో భాగంగా నిర్ణయించారు. పాశ్చాత్య దేశాలకు ముప్పుగా పరిణమించే ఉగ్రవాదులు ఆఫ్ఘన్ భూభాగంపై లేకుండా చూసుకుంటామని తాలిబన్లు అమెరికాకు హామీ ఇచ్చారు. అయితే ఈ మధ్యలో తాలిబన్, ఆఫ్ఘన్ ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు విఫలమవుతూ వచ్చాయి. ఈ ఒప్పందం ప్రకారం ఇప్పుడు అమెరికా దశల వారీగా తమ బలగాలను వెనక్కి రప్పిస్తోంది.
దీంతో ఆఫ్ఘనిస్థాన్లో మరోసారి రాజ్యాంగాధికారం కోసం తాలిబన్లు దాడులకు తెగబడుతున్నారు. అమెరికా బలగాల మద్దతు లేకపోవడంతో ఆఫ్ఘన్ సేనలు వారికి ఎదురు నిలవలేకపోతున్నాయి. అమెరికాకు ఇచ్చిన హామీని తాలిబన్లు తుంగలో తొక్కుతున్నారు. శాంతియుతంగా ప్రభుత్వంతో చర్చలు జరుపుతామన్న హామీని కూడా తాలిబన్లు పట్టించుకోవడం లేదు.
ఆఫ్ఘనిస్థాన్లో అమెరికా రెండు దశాబ్దాల పాటు యుద్ధం చేసింది. ఈ యుద్ధంలో అమెరికా సంకీర్ణ దళాలతోపాటు తాలిబన్లు, ఆఫ్ఘన్ పౌరులు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయారు. బ్రౌన్ యూనివర్సిటీ చేసిన అధ్యయనం ప్రకారం.. ఆఫ్ఘన్ సాయుధ దళాల్లో 69 వేల మంది మృత్యువాత పడ్డారు. ఇక ఆఫ్ఘన్ పౌరులు 51 వేల మంది, మిలిటెంట్లు మరో 51 వేల మంది ఈ సుదీర్ఘ యుద్ధంలో మరణించారు. ఇక 2001 నుంచి 3500 మంది అమెరికా సంకీర్ణ దళాలకు చెందిన సైనికులు చనిపోయారు. వీళ్లలో మూడింట రెండో వంతు అమెరికా సైనికులే. 20 వేల మందికిపైగా అమెరికా సైనికులు గాయపడ్డారు.
ఈ యుద్ధం కారణంగా ఆఫ్ఘనిస్థాన్లో కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. 2012 నుంచి సుమారు 50 లక్షల మంది దేశాన్ని వదిలి వెళ్లారు. వీళ్లలో చాలా మంది మళ్లీ స్వదేశానికి తిరిగి రాలేదు. వివిధ దేశాల్లో తలదాచుకుంటున్నారు. అంతేకాదు ఆఫ్ఘన్ యుద్ధంపై అమెరికా భారీగా ఖర్చు చేసింది. అక్కడి మిలిటరీతోపాటు ఆఫ్ఘన్ పునర్నిర్మాణానికి ఈ 20 ఏళ్లలో సుమారు లక్ష కోట్ల డాలర్లు అమెరికా ఖర్చు చేయడం గమనార్హం. ఇంతా చేసి ఇప్పుడు అమెరికా దళాలు దేశాన్ని వదిలి వెళ్తుండటంతో ఆఫ్ఘనిస్థాన్ మరోసారి రాక్షస మూకల చేతుల్లోకి వెళ్లిపోతోంది.
తాలిబన్ అనే పదం తాలిబ్ అనే అరబిక్ పదం నుంచి వచ్చింది. తాలిబ్ అంటే విద్యార్థి అని అర్థం. పాకిస్థాన్కు చెందిన మతపరమైన స్కూలు విద్యార్థులు దీనిని స్థాపించారు కాబట్టి ఈ మిలిటెంట్ గ్రూప్కు తాలిబన్లు అనే పేరు వచ్చింది. 2021 నాటికి తాలిబన్లలో మొత్తం 75 వేల మంది ఫైటర్లు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. వీళ్లు తమకు తాము ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్గా చెప్పుకుంటారు.
ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్లో మూడింట రెండొంతుల ప్రాంతం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. రెండో అతిపెద్ద నగరం కాందహార్ను కూడా వాళ్లు ఆక్రమించేశారు. ఇక మొత్తం దేశం వాళ్ల ఆధీనంలోకి వెళ్లిపోతుందా అన్నదే ఇప్పుడు ప్రశ్న. త్వరలోనే కాబూల్నూ ఆక్రమించుకుంటామని తాలిబన్లు చెబుతున్నా.. అక్కడి ప్రభుత్వాన్ని కూలదోయరన్న నమ్మకం తనకు ఉందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ చెప్పడం గమనార్హం. అమెరికా దళాలను వెనక్కి రప్పించడాన్ని ఆపబోమని ఆయన స్పష్టం చేశారు. అమెరికా ఎంబసీ, కాబూల్ ఎయిర్పోర్ట్, ఇతర కీలకమైన ప్రభుత్వ స్థావరాల భద్రత కోసం మాత్రం 650 నుంచి 1000 మంది బలగాలను అక్కడే ఉంచుతామని మాత్రం బైడెన్ చెప్పారు.