హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ ): హైదరాబాద్ నగరాన్ని సిగ్నల్ రహితంగా మార్చాలన్న ప్రభుత్వ సంకల్పానికి సోమవారం మరో ముందడుగు పడనున్నది. కూకట్పల్లి-హైటెక్సిటీ మధ్య నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ)ని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ)లో భాగంగా ఈ ఆర్యూబీని నిర్మించారు. రూ.66.59 కోట్ల వ్యయంతో 410 మీటర్ల పొడవు, 20.60 మీటర్ల వెడల్పుతో దీనిని నిర్మించారు. ఈ ఆర్యూబీ అందుబాటులోకి వస్తే కూకట్పల్లి-హైటెక్సిటీ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు శాశ్వతంగా తొలగిపోతాయి. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు ట్రాఫిక్ చిక్కులు తప్పుతాయి. ఈ ఆర్యూబీ నిర్మాణానికి ముందు శేరిలింగంపల్లి నుంచి వచ్చే వరదనీరు ఈ బ్రిడ్జి కింద నుంచే వెళ్లేది. బ్రిడ్జి ఎప్పుడూ నీటితో నిండి ఉండేది. భారీ వర్షాలు పడితే ఈ మార్గంలో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయేవి. వరదనీటిని అక్కడే నిల్వ చేసేందుకు బ్రిడ్జి కింద పెద్ద సంపును నిర్మించారు. అందులోని నీటిని మూసాపేట సర్కిల్లో హరితహారం మొక్కలకు అందిస్తున్నారు.
ఇవీ కూడా చదవండి…
టీఆర్ఎస్తోనే కులవృత్తులకు వైభవం
ఎస్హెచ్జీలకు రికార్డు రుణాలు