రీడిజైన్ల ద్వారా ప్రాజెక్టుల సామర్థ్యం పెంపు
సమస్యలను అధిగమించి నీరిచ్చిన ఘనత సీఎందే
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్
వేములవాడ, మార్చి 28: ఉమ్మడి రాష్ట్రంలో నీటి పారుదల విషయంలో నాటి ఆంధ్రపాలకుల నిర్లక్ష్యానికి కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టు నిదర్శనం అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. స్వరాష్ట్రంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలతో బీడు భూములకు సాగు నీరందుతున్నదని స్పష్టంచేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఎమ్మెల్యే రమేశ్బాబు నివాసంలో వినోద్కుమార్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రాజెక్టులను రీడిజైన్ చేసి జలాశయాల సామర్థ్యాలను పెంచారని, ఇందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను బీడు భూములకు మళ్లిస్తున్నారని తెలిపారు. గోదావరిపై మహారాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణంతో ఎస్సారెస్పీ నిండే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తంచేశారు. మేడిపల్లి, కథలాపూర్ మీదుగా వదదకాలువ ఉన్నా నీటికి నోచుకోలేని దుస్థితి ఉండేదని, సూరమ్మచెరువు ద్వారా ఎత్తిపోతల పనులను చేపట్టాలని తాను ఎంపీగా ఉన్న సమయంలో ప్రభుత్వాన్ని కోరగా పనులు వేగవంతమయ్యాయని గుర్తు చేశారు.
విపక్షాలు అర్థంలేని విమర్శలు మానాలి
కాంగ్రెస్, బీజేపీ నాయకులు అర్థంలేని విమర్శలు మానుకొని ప్రజలకు మేలు జరిగే సూచనలు, సలహాలు ఇస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని వినోద్ చెప్పారు. కరోనా కష్టకాలం లో దేశంలోని అన్ని రాష్ర్టాల్లో ఆర్థిక పరిస్థితులు గడ్డుగా ఉన్నా.. తెలంగాణలో సీఎం కేసీఆర్ గత యాసంగి, వానకాలం సీజన్లలో రైతులు పండించిన ధాన్యాన్ని రూ.12 వేల కోట్లతో కొనుగోలు చేశారని గుర్తుచేశారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు కుటుంబం మొదటి నుంచి ప్రజాసేవలో ముందున్నదని, దివంగత చెన్నమనేని రాజేశ్వర్రావు స్వాతంత్రోద్యమకారుడిగా పనిచేయడమే కాకుండా దున్నే వాడికే భూమి ఉండాలని పోరాడిన గొప్ప వ్యక్తి అని గుర్తుచేశారు. అలాంటి కుటుంబంపై దిగజారుడు విమర్శలు చేయడం సరికాదని హితవుపలికారు. పౌరసత్వ వివాదం కోర్టు పరిధిలో ఉందని, దానిపై రాద్దాం తం అవసరం లేదని అన్నారు. వేములవాడ నుంచి తాను పోటీ చేయబోనని స్పష్టం చేశారు. దేశంలో లేకపోయినా ఎమ్మెల్యే రమేశ్బాబు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో అందుబాటులో ఉండి ప్రజాసమస్యలపై ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారని చెప్పారు. సమావేశంలో రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జడ్పీ చైర్పర్సన్లు న్యాలకొండ అరుణ, ద్యావ వసంత, వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, నాయకులు మనోహర్రెడ్డి, రాఘవరెడ్డి పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఓపెన్ స్కూళ్లకూ పాఠ్యపుస్తకాలు
తీరొక్క ఆప్షన్లతో ధరణి పోర్టల్