జెనీనా: కోవిడ్ టీకాలకు ఇప్పడు అంతటా డిమాండ్ ఉన్నది. కానీ ఆ డిమాండ్కు తగినట్లు ఉత్పత్తి లేకపోవడం సమస్యగా మారింది. పేద దేశాలకు కోవిడ్ టీకాలు అందించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవాక్స్ పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. కోవాక్స్కు వివిధ దేశాలు టీకాలు అందించేందుకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నాయి. కానీ ఆ ఒప్పందం ప్రకారం ఇండియాలోని సీరం సంస్థ టీకాలు అందివ్వడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. భారత్లో వైరస్ విజృంభణ తగ్గిన తర్వాత.. సీరం సంస్థ కోవాక్స్ కోసం నిబద్దతో టీకాలను అందించాలని డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టీకాల సరఫరా మందిగించిందని, జూలై నాటికి 19 కోట్ల టీకాలు తక్కువవుతున్నాయని ఆయన అన్నారు. కోవాక్స్ ప్రోగ్రామ్లో భాగంగా ఇప్పటి వరకు 124 దేశాలకు 6.5 కోట్ల డోసులను పంపిణీ చేశారు. భారత్లో కరోనా ఉదృతి వల్ల కోవాక్స్ గ్రూపునకు టీకాలు కావాల్సిన రీతిలో అందడం లేదని యునిసెఫ్ కూడా పేర్కొన్నది.
ఈ ఏడాది సుమారు 4 కోట్ల డోసులు ఇచ్చేందుకు అమెరికాకు చెందిన ఫైజర్ అంగీకరించింది. కానీ దీంట్లో మెజారిటీ భాగం ఈ ఏడాది రెండవ అర్థభాగంలో అందే అవకాశాలు ఉన్నట్లు టెడ్రోస్ తెలిపారు. మోడెర్నా కూడా 5 కోట్ల టీకాలు ఇచ్చేందుకు అంగీకరించింది. కానీ ఆ టీకాలు వచ్చే ఏడాది కోవాక్స్కు చేరే అవకాశాలు ఉన్నాయి. కోవాక్స్ గ్రూపుకు చేయూతనిచ్చేందుకు ఇండియా కూడా అంగీకరించింది. అయితే సీరం సంస్థ తయారు చేసే కోవీషీల్డ్ టీకాలను 64 పేద దేశాల్లో పంపిణీ చేయాల్సి ఉన్నది. 2021లో పేద దేశాలకు పది కోట్ల డోసలు ఇస్తామని సీరం, గవీ, గేట్స్ ఫౌండేషన్ ప్రకటించాయి. కానీ దానికి తగినట్లు టీకాలు సరఫరా కావడం లేదు.