హైదరాబాద్ : కొవిడ్ రోగులకు మెడికల్ ఆక్సిజన్ కొరత లేదని, ఆక్సిజన్ సరఫరాలో ఎప్పుడూ అంతరాయం తలెత్తలేదని తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) డైరెక్టర్ డాక్టర్ విమల థామస్ చెప్పారు. ఆసుపత్రి ఆక్సిజన్ సరఫరాతో ఇబ్బందులు పడుతోందన్న కథనాలపై ఆమె మంగళవారం స్పందించారు. 20 కేఎల్ సామర్థ్యం కలిగిన లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్ ఆసుపత్రి అవసరాలను తీర్చేందుకు సరిపోతుందని తెలిపారు.
ఆక్సిజన్ ట్యాంకర్ కాకుండా, డి రకం సిలిండర్లతో కూడిన ఆక్సిజన్ మానిఫోల్డ్ కూడా ఉందన్నారు. ప్రస్తుతం ఈ సిలిండర్ను నింపేందుకు తమకు ప్రత్యేక ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్ ఉందని తెలిపారు. ఆస్పత్రి ఇమేజ్ దెబ్బతీసేలా, ఆస్పత్రికి వచ్చే రోగులను భయభ్రాంతులకు గురిచేసేలా వార్తలు ఉన్నాయంది. ఐసీయూలో సంభవించిన మరణాలు ఆక్సిజన్ కొరత వల్ల కాదని డాక్టర్ విమల స్పష్టం చేశారు.