నిర్మల్ జిల్లాలో 1.50 లక్షల మందికి ఇచ్చేందుకు చర్యలు
వ్యాక్సినేషన్పై విస్తృత ప్రచారం.. టెస్టులు పెంచిన యంత్రాంగం..
పాలిటెక్నిక్ కళాశాలలో 100 పడకలతో క్వారంటైన్ కేంద్రం సిద్ధం
నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 7 : నిర్మల్ జిల్లాలో కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ సరైన ఔషధం కాగా.. టీకా అందరికీ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటివరకు ఫ్రంట్లైన్ వారియర్స్కు మొదటి, రెండో డోసు పూర్తికాగా.. 60 ఏండ్లు, 45 ఏండ్లకు పైబడి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకా ప్రక్రియ కొనసాగుతున్నది. వీరితోపాటు ఈనెల 1వ తేదీ నుంచి 45 ఏండ్లు నిండిన వారికి టీకాలు వేస్తున్నారు. చాలా మంది అవగాహన లేకపోవడం, భయంతో ముందుకు రావడం లేదు. దీంతో వైద్యాధికారులు, సిబ్బంది, కళాజాత బృందం వారు టీకా వేసుకోవాలని విస్తృత ప్రచారం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామీణ, తండాలు, గూడేల్లో కూడా విస్తృతమైన అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలోని 25 సీహెచ్సీ కేంద్రాల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ప్రతిరోజూ వైద్యులు 1000 మందికిపైగా టీకా అందిస్తున్నారు. ప్రభుత్వ సెలవు రోజుల్లో కూడా వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
యంత్రాంగం సన్నద్ధం
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా టెస్టులతోపాటు వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా అధికారులు పెంచుతున్నారు. జిల్లాలో 45 ఏండ్లు పైబడిన వారు 2 లక్షల మంది ఉన్నట్లు అధికారులు గుర్తించగా.. ఈనెల చివరి నాటికి 1.50 లక్షల మందికి వ్యాక్సిన్ వేయాలని అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఇప్పటికే వైద్యాధికారులతో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ సమావేశం నిర్వహించి ఆయా శాఖల సమన్వయంతో ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు అనుగుణంగా నిర్మల్, ముథోల్, భైంసా నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామంలో రోజూ 250 మందికి టీకా ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించారు. గ్రామం, మండలాల్లో వైద్యశాఖ అధికారులు టీంలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి టీంలో ఎంపీడీవో, తహసీల్దార్, మెడికల్ ఆఫీసర్ ఉంటారు. వీరు అర్హులను గుర్తించి టీకా విశిష్టతను వివరిస్తారు. కాగా.. గతేడాది మాదిరిగా ఇండ్లలో ప్రత్యేక గదులు, అదనపు మరుగుదొడ్లు లేని కొవిడ్ బాధితుల కోసం క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. గతంలో పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన క్వారంటైన్ కేంద్రంలోనే ఏర్పాట్లు చేస్తున్నారు. 100 పడకలకు అనుగుణంగా కేంద్రాన్ని సిద్ధం చేస్తున్నారు. గదులను పూర్తిగా శుభ్రం చేసి శానిటైజ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీలో ఐదు వేలు దాటిన రోజువారీ కరోనా కేసులు
మహారాష్ట్రలో ఒక్కరోజే 60వేల కేసులు