వాషింగ్టన్ : పప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ల మధ్య ఈనెల 24న జరిగే భేటీతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం బలోపేతమవుతుందని వైట్హౌస్ అధికారులు పేర్కొన్నారు. క్వాడ్ గ్రూప్ జోరందుకునేందుకూ ఈ సమావేశం దోహదపడుతుందని ఆకాంక్షించారు. సెప్టెంబర్ 24న వైట్హౌస్లో ఇరువురు నేతల తొలి భేటీకి బైడెన్ ఆతిధ్యం ఇవ్వనున్నారు. ఈ సమావేశం అనంతరం వైట్హౌస్లో జరిగే క్వాడ్ నేతల భేటీలో ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని యోషిహిదె సుగ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్లతో బైడెన్ సంప్రదింపులు జరుపుతారు.
బైడెన్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం మోదీ, బైడెన్లు పలుమార్లు ఫోన్ సంభాషణలు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదింపులు జరిపారు. వీరిద్దరి మధ్య చివరిగా ఏప్రిల్ 26న ఫోన్ సంప్రదింపులు జరిగాయి. ఇక ముఖాముఖి భేటీలో బైడెన్, మోదీ ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాల బలోపేతానికి ఏడు దశాబ్ధాలకు పైగా ఇరు దేశాల మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని మరింత పరిపుష్టం చేసే దిశగా చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తారని వైట్హౌస్ వర్గాలు పేర్కొన్నాయి.