ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్
పట్టణ బడ్జెట్ రూ.63.55కోట్లు
మున్సిపల్ పాలకవర్గ సమావేశం
హాజరైన కలెక్టర్ గుగులోత్ రవి
జగిత్యాల అర్బన్, మార్చి 31: మౌలిక వసతుల కల్పన, స్వచ్ఛ హరిత జగిత్యాలగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా 2021-22 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను రూపొందించినట్లు ఎమ్మెల్యే సంజయ్కుమార్ పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయం లో చైర్పర్సన్ బోగ శ్రావణి అధ్యక్షతన బడ్జెట్ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ గుగులోతు రవి, ఎమ్మెల్యే హాజరయ్యారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.63.55కోట్ల బడ్జెట్ను కౌన్సిల్ ఆమోదించింది. బడ్జెట్లో 10 శాతం గ్రీన్ బడ్జెట్కు రూ. 3.28 కోట్లు కేటాయించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పారిశుధ్య పనుల నిర్వహణకు రూ. 2.50 కోట్లు కేటాయించారు. విలీన గ్రామాలాభివృద్ధి, వెనుకబడిన తరగతులు, మైనారిటీల అభివృద్ధి, పార్కులు, ఆట స్థలాలు, పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ వంటి పనుల కోసం రూ.43.89 కోట్లు కేటాయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభు త్వం పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నదన్నారు. అభివృద్ధి పనుల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, వైకుంఠధామాలు నిర్మించడానికి ప్రత్యేక నిధులు కేటాయించామన్నారు. అలాగే టీయూఎస్డీసీ నుంచి రూ.50 కోట్ల నిధులతో ఇప్పటికే పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి మాట్లాడుతూ, పట్టణాభివృద్ధే ధ్యేయంగా బడ్జెట్ను రూపొందించామన్నారు. సమావేశంలో కమిషనర్ మారుతీప్రసాద్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులున్నారు.
రాయికల్ బడ్జెట్ రూ.14.21 కోట్లు
రాయికల్ రూరల్, మార్చి 31: రాయికల్ మండల పరిషత్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు అధ్యక్షతన బుధవారం మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. 2021-2022 సంవత్సరానికి రూ.14.21 కోట్ల బడ్జెట్ను పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలుపడం అభినందనీయమన్నారు. పట్టణంలోని వార్డులకు నిధుల కేటాయింపులో పారదర్శకత పాటించి, పట్టణ సమగ్రాభివృద్ధికి బాటలు వేసుకోవాలని సూచించారు. పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్లకు చర్యలు తప్పవని హెచ్చరించారు. పచ్చదనం, పరిశుభ్రతకు పెద్దపీట వేయాలన్నారు. సమావేశానికి హాజరైన కలెక్టర్ రవి మాట్లాడుతూ, కంపోస్ట్ షెడ్లు, వైకుంఠధామాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు మ్యాకల కాంతారావు, తురగ శ్రీధర్ రెడ్డి, వల్లకొండ మహేశ్గౌడ్, మహేందర్ నాయక్, మ్యాకల అనురాధ, శ్రీరాముల సత్యనారాయణ, పెండెల వనిత, పిప్పోజి మహేందర్ బాబు, సోహెల్ తదితరులు పాల్గొన్నారు.