వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ప్రస్తుతం ఆగ్నేయాసియా పర్యటనలో ఉన్న విషయం తెలుసు కదా. ఆమె బుధవారం సింగపూర్ నుంచి వియత్నాం వెళ్లాల్సి ఉన్నా.. కొన్ని గంటల పాటు ఆమె ప్రయాణాన్ని వాయిదా వేశారు. దీనికి అధికారులు చెప్పిన కారణం హవానా సిండ్రోమ్( Havana syndrome ). ఐదేళ్ల కిందట తొలిసారి క్యూబా రాజధాని హవానాలో గుర్తించిన ఈ సిండ్రోమ్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అమెరికా అధికారులు, దౌత్యవేత్తలను వేధిస్తోంది. పలువురు గూఢాచారులు, దౌత్యవేత్తలు ఈ హవానా సిండ్రోమ్ కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పర్యటన ఈ సిండ్రోమ్ కారణంగా వాయిదా పడిందన్న వార్తల నేపథ్యంలో మరోసారి దీనిపై చర్చ మొదలైంది. అసలు ఏంటీ హవానా సిండ్రోమ్? అమెరికా అధికారులు లక్ష్యంగా చేసుకొని ప్రయోగిస్తున్న రహస్య ఆయుధమా? లేక అంతుబట్టని వ్యాధా? దీనిపై అమెరికా ఎలా స్పందిస్తోందన్నది ఈ స్టోరీలో చూడండి.
తాజాగా వియత్నాంలో ఉన్న ఇద్దరు అమెరికా సిబ్బంది ఈ హవానా సిండ్రోమ్తో బాధపడుతున్నారని అమెరికా అధికారులు వెల్లడించారు. వీళ్లు కమలా హ్యారిస్ లేదా వైట్హౌజ్కు పని చేయకపోయినా.. ఆ అధికారులు ఎవరు అన్నది మాత్రం వాళ్లు చెప్పలేదు. ఈ కేసుల కారణంగా ఆమె పర్యటనను కాసేపు నిలిపేసినా.. తర్వాత ఎలాంటి ప్రమాదం లేదని తెలిసిన తర్వాత ఆమె వియత్నాం పర్యటన కొనసాగించారు. అప్పటి నుంచీ ఈ హవానా సిండ్రోమ్పై మరోసారి చర్చ మొదలైంది.
హవానా సిండ్రోమ్ తొలిసారి 2016లో క్యూబా రాజధాని హవానాలో కనిపించింది. అక్కడ అమెరికా ఎంబసీలో పని చేసే దౌత్యవేత్తలు, గూఢాచారుల్లో ఇది కనిపించింది. ఇప్పటి వరకూ 200కుపైగా అమెరికా అధికారులు ఈ సిండ్రోమ్ బారిన పడినట్లు న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ వెల్లడించింది. క్యూబాతోపాటు జర్మనీ, ఆస్ట్రియా, రష్యా, చైనాలాంటి ఇతర దేశాల్లో పని చేసే అమెరికన్ అధికారుల్లో ఇది ఎక్కువగా కనిపించింది. గతేడాది నవంబర్లో వైట్హౌజ్ సమీపంలోని అధికారి కూడా ఈ సిండ్రోమ్ లక్షణాలతో బాధపడ్డాడు. మొత్తం కేసుల్లో 50 వరకూ సీఐఏ అధికారులవే ఉండగా.. మిగతావి అమెరికా మిలిటరీ, విదేశాంగ శాఖ అధికారులవని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.
ఈ హవానా సిండ్రోమ్తో బాధపడే వ్యక్తిలో వివిధ లక్షణాలు కనిపిస్తాయి. వికారం, వినికిడి లోపం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, మగతగా ఉండటం వంటివి ఇందులో ఉన్నాయి. చెవుల్లో భారీ శబ్దాలు వినిపించినట్లుగా, ముఖంపై తీవ్ర ఒత్తిడి ఉన్నట్లుగా కూడా కొందరు ఫిర్యాదు చేశారు. తలనొప్పి, చెవి నొప్పి, చూపు మందగించడం, శరీర సమతుల్యత కోల్పోవడం వంటివి కూడా మరికొందరు చెప్పారు. 2016లో తొలిసారి ఈ సిండ్రోమ్ బారిన పడిన అధికారులు.. తమ తలలో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఇలాంటి వాళ్లలో ఒక పేషెంట్ తలను స్కాన్ చేయగా.. కారు ప్రమాదం లేదా బాంబు పేలుళ్లలో దెబ్బతిన్న స్థాయిలో మెదడులో టిష్యూ డ్యామేజ్ అయినట్లు తేలడం గమనార్హం.
ఈ సిండ్రోమ్కు అసలు కారణం ఏంటన్నది ఇప్పటికీ తెలియలేదు. దీనిపై అమెరికా ఏజెన్సీలు విచారణ జరుపుతున్నాయి. దీనికి ఉద్దేశపూర్వక కారణం కావచ్చని ఆ అధికారులు విశ్వసిస్తున్నారు. ఓ మానిసక సంబంధిత సమస్యగా మొదట్లో చెప్పినా.. తర్వాత దీని చుట్టూ ఎన్నో కథనాలు వచ్చాయి. కావాలని లక్ష్యంగా చేసుకొని మైక్రోవేవ్స్ లేదా సోనిక్ దాడి చేయడం వల్ల ఇలా జరుగుతోందా అన్న దిశగా కూడా విచారణ జరిపారు.
ఇదొక మానసిక సమస్యే అని కొందరు సైంటిస్టులు చెబుతున్నారు. బహుశా విదేశీ మిషన్లలో ఉండే ఒత్తిడి వాతావరణం దీనికి కారణం కావచ్చని వాళ్లు భావిస్తున్నారు. అయితే గతేడాది డిసెంబర్లో నేషనల్ అకాడమిక్స్ ఆఫ్ సైన్సెస్ ఓ రిపోర్ట్ వెలువరించింది. ఈ సిండ్రోమ్కు లక్ష్యంగా చేసుకున్న రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ ముఖ్యమైన కారణం కావచ్చని ఈ రిపోర్ట్ అభిప్రాయపడింది. మరికొందరు పరిశోధకులు మైక్రోవేవ్ ఆయుధాలు కూడా దీనికి కారణం కావచ్చన్న అనుమానాలు వ్యక్తం చేశారు.
ఈ మిస్టరీ సిండ్రోమ్ అసలు నిజమేనా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. కమలా హ్యారిస్ ప్రయాణం ఆలస్యం వార్తలు వచ్చిన తర్వాత ఎంతో మంది ఈ సిండ్రోమ్ అసలు నిజమేనా అన్న సందేహాలు లేవనెత్తారు. అయితే ఇది కచ్చితంగా నిజమే కాదు చాలా తీవ్రమైన విషయమని సీఐఏ డైరెక్టర్ విలియం బర్న్స్ చెప్పడం విశేషం. అందుకే అమెరికా దీనిపై ఎప్పటి నుంచో విచారణ జరుపుతోంది. తాజాగా వియత్నాంలో కనిపించిన కేసులపైనా విచారణ జరుపుతున్నట్లు బైడెన్ ప్రభుత్వం వెల్లడించింది. ఓ టాస్క్ఫోర్స్ను కూడా ఏర్పాటు చేశారు. బిన్ లాడెన్ వేటలో కీలకపాత్ర పోషించిన ఓ వెటరన్ అధికారిని కూడా ఇందులో నియమించినట్లు వార్తలు వస్తున్నాయి.