వరంగల్ అర్బన్ : వరంగల్ మహా నగరంలో సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల ఏర్పాటుకు వేగంగా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, అర్బన్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సంబంధిత శాఖల అధికారులతో కలసి నగరంలోని పలు స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి హన్మకొండలోని రోడ్ల భవనాల శాఖ కార్యాలయం పక్కన గల స్థలాన్ని, నక్కలగగుట్ట లోని పాత ఇరిగేషన్ కార్యాలయం, వరంగల్ పాలిటెక్నిక్ పశు సంవర్ధక శాఖ కార్యాలయం వద్ద స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అదేశాల ప్రకారం గజ్వేల్ మాదిరిగా మోడల్ మార్కెట్ ఏర్పాటుకు కనీసం 5 ఎకరాల స్థలం ఉండే విధంగా అనువైన స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.
వరంగల్ లక్మిపురంలో సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ ఏర్పాటుకు ప్రభుత్వం రూ. 24 కోట్లు మంజూరు చేసిందన్నారు. డీపీఆర్ త్వరగా చేసి పనులు ప్రారంభించాలన్నారు. దీనికి అదనంగా మరో 4 సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ ఏర్పాటుకు కాజిపేట్ పాత మార్కెట్, చింతగట్టు కెనాల్ వద్ద స్థలాలు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఆర్ అండ్ బి, బల్దియా ఎస్ఈలు సత్యనారాయణ, సత్యనారాయణ రెడ్డి, ఈఈ రాజాం, బల్దియా డీఈ నరేందర్, ఏసీపీ ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.