అబూ ధాబీ: ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ, ఆయన కుటుంబానికి మానవతా దృక్పథంతో ఆశ్రయం ఇచ్చినట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తెలిపింది. ‘అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ, ఆయన కుటుంబాన్ని మానవతా ప్రాతిపదికన దేశంలోకి స్వాగతించినట్లు యూఏఈ విదేశాంగ వ్యవహారాలు, అంతర్జాతీయ సహకార మంత్రిత్వ శాఖ ధృవీకరిస్తున్నది’ అని సంక్షిప్త ప్రకటనలో బుధవారం పేర్కొంది. దీంతో అష్రఫ్ ఎక్కడ ఉన్నారన్న సందిగ్ధం వీడిపోయింది.
తాలిబన్లు ఆదివారం రాజధాని కాబూల్లోకి ప్రవేశించడంతో ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ అధికార భవనాన్ని వీడి కుటుంబంతో కలిసి ప్రత్యేక విమానంలో దేశం నుంచి వెళ్లిపోయారు. కాగా, ఆయనకు ఆశ్రయం ఇచ్చేందుకు తజకిస్థాన్ నిరాకరించిందని, దీంతో ఒమన్కు వెళ్లినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.
అయితే అష్రఫ్ తమ దేశానికి వచ్చినట్లు యూఏఈ బుధవారం వెల్లడించింది. మానవతా దృక్పథంతో ఆయనకు ఆశ్రయం ఇచ్చినట్లు పేర్కొంది. కాగా, తాలిబన్లు గెలిచారని, రక్తపాతాన్ని ఆపేందుకే తాను దేశం వీడినట్లు అష్రఫ్ ఘనీ ఫేస్బుక్ పోస్ట్లో తెలిపారు.
మరోవైపు ఆయన నాలుగు కార్లు, హెలీకాప్టర్ నిండా డబ్బులతో పారిపోయారని రష్యా ఆరోపించింది. అయితే దీనిపై అష్రఫ్ ఘనీ ఇంకా స్పందించలేదు.