నేపియర్: ఇప్పటి వరకు మీరు ఎప్పుడైనా క్రికెట్లో టార్గెట్ ఎంతో తెలియకుండానే బ్యాటింగ్కు దిగిన టీమ్ను చూశారా? బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మ్యాచ్లో ఈ వింత చోటు చేసుకుంది. తమ టార్గెట్ ఎంతో సరిగ్గా తెలుసుకోకుండానే బంగ్లాదేశ్ బ్యాటింగ్కు దిగింది. 1.3 ఓవర్ల పాటు ఆడిన తర్వాత అంపైర్లు ఆటను ఆపేసి వాళ్లకు టార్గెట్ ఎంతో చెప్పాల్సి వచ్చింది. ఈ కారణంగా ఐదు నిమిషాల పాటు ఆట నిలిచిపోవడం విశేషం.
ఎలా జరిగింది?
న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో టీ20కి వర్షం అడ్డుపడింది. ఆ సమయానికి న్యూజిలాండ్ 17.5 ఓవర్లలో 173 పరుగులు చేసింది. దీంతో డక్వర్త్ లూయిస్ మెథడ్ ప్రకారం బంగ్లాదేశ్కు 16 ఓవర్లలో 170 పరుగుల లక్ష్యాన్ని విధించారు. కానీ ఆ టీమ్ మాత్రం తాము చేజ్ చేయాల్సింది 16 ఓవర్లలో 148 పరుగులు అని భావించి బరిలోకి దిగింది. కానీ 1.3 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ ఛేదనపై అయోమయం నెలకొని ఆటను ఆపేయాల్సి వచ్చింది. మీరు చేజ్ చేయాల్సింది 16 ఓవర్లలో 170 పరుగులు అని అంపైర్లు ఆ టీమ్కు చెప్పారు. అసలు టార్గెట్ తెలుసుకోకుండానే ఎలా చేజింగ్ మొదలుపెడతారు అంటూ న్యూజిలాండ్ ప్లేయర్ జిమ్మీ నీషమ్ ట్వీట్ చేయడం విశేషం. చివరికి బంగ్లా 16 ఓవర్లలో 143 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.
ఇవి కూడా చదవండి..