కేంద్రానికి హామీ ఇచ్చిన భారత్ బయోటెక్, సీరం
వచ్చే నాలుగు నెలలకు ప్రణాళికల సమర్పణ
న్యూఢిల్లీ, మే 12: వచ్చే నాలుగు నెలల్లో కరోనా టీకాల ఉత్పత్తిని పెంచుతామని కేంద్రానికి భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ హామీ ఇచ్చాయి. కేంద్ర ఆరోగ్యశాఖ, భారత ఔషధ నియంత్రణ సంస్థ అడిగిన నేపథ్యంలో.. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల టీకా ఉత్పత్తి ప్రణాళికలను ఈ కంపెనీలు బుధవారం ప్రభుత్వానికి సమర్పించాయి. జూలైలో 3.32 కోట్లు, ఆగస్టు, సెప్టెంబర్లలో 7.82 కోట్ల చొప్పున కొవాగ్జిన్ టీకా డోసులను ఉత్పత్తి చేస్తామని భారత్ బయోటెక్ తెలిపినట్లు సమాచారం. ఆగస్టు నాటికి నెలకు 10 కోట్ల కొవిషీల్డ్ టీకా డోసులను ఉత్పత్తి చేస్తామని, సెప్టెంబర్లో కూడా దానినే కొనసాగిస్తామని సీరం ఇన్స్టిట్యూట్ ప్రతినిధి తెలిపినట్లు సమాచారం.
మే-జూన్ నాటికి కొవాగ్జిన్ ఉత్పత్తి రెట్టింపు: కేంద్రం
కొవాగ్జిన్ ఉత్పత్తిని మే-జూన్ నాటికి రెట్టింపు చేస్తామని, జూలై-ఆగస్టు నాటికి ఆరు నుంచి ఏడు రెట్లు పెంచుతామని కేంద్రం ప్రకటించింది. సెప్టెంబర్లోగా నెలకు 10 కోట్ల కొవాగ్జిన్ డోసులు ఉత్పత్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కొవాగ్జిన్ టీకాలకు తీవ్ర కొరత నెలకొన్న నేపథ్యంలో.. కేంద్ర శాస్త్రసాంకేతికశాఖ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసి ఈ వివరాలను తెలియజేసింది. ‘ఆత్మనిర్భర్ భారత్ 3.0, మిషన్ కొవిడ్ సురక్ష కింద స్వదేశీ కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. దీంట్లోభాగంగా కొవాగ్జిన్ను ఉత్పత్తి చేస్తున్న హైదరాబాద్లోని భారత్ బయోటెక్ కంపెనీతోపాటు కొన్ని ప్రభుత్వరంగ సంస్థల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచటానికి చర్యలు తీసుకుంటున్నాం. ఈ మేరకు బెంగళూరులోని భారత్ బయోటెక్ కొత్త కేంద్రానికి ప్రభుత్వం రూ.65 కోట్ల గ్రాంటును అందిస్తున్నది. మహారాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ముంబైలో పని చేస్తున్న హాఫ్కిన్ బయోఫార్మా కంపెనీకి కూడా రూ.65 కోట్ల గ్రాంటును కేంద్రం ఇవ్వనుంది. ఆరునెలల తర్వాత ఈ కంపెనీ నుంచి నెలకు 2 కోట్ల డోసుల టీకాలు ఉత్పత్తి అవుతాయి. హైదరాబాద్లోని ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్, బులంద్షహర్లోని భారత్ ఇమ్యునోలాజికల్స్ అండ్ బయోలాజికల్స్ లిమిటెడ్ సంస్థలకు కూడా సాయం అందిస్తాం. ఆగస్టు-సెప్టెంబర్ నాటికి ఇవి నెలకు 1-1.5 కోట్ల డోసులను అందిస్తాయి’ అని ఆ ప్రకటనలో తెలియజేశారు.